Crude Oil | దేశీయంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా.. సామాన్యుడి జేబుకు చిల్లు పడనున్నదా.. అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 1.81 డాలర్లు లేదా 2.4 శాతం ధర పెరిగింది. ఇంట్రా డే ట్రేడింగ్లో 78.93 డాలర్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి 77.94 డాలర్ల వద్ద స్థిర పడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 1.84 డాలర్లు లేదా 2.6 శాతం పెరిగింది. అంతర్గత ట్రేడింగ్లో 75.06 డాలర్ల గరిష్టానికి చేరుకుని 73.58 డాలర్ల స్థాయి వద్ద ముగిసింది. శుక్రవారం బ్రెంట్ క్రూడ్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కాంట్రాక్ట్ ధర కూడా రెండు శాతానికి పైగా పెరిగింది.
దీనికి ప్రపంచ దేశాలకు క్రూడాయిల్ ప్రధానంగా సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయమే కారణం. జూలై నుంచి ప్రతి రోజూ ఒక మిలియన్ బ్యారెళ్ల (పీడీడీ) ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అరేబియా తీర్మానించింది. అంతర్జాతీయంగా సూక్ష్మ ఆర్థిక సమస్యలకు తోడు మార్కెట్లలో మందగమనం నేపథ్యంలో క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించుకున్నది. గత నెలలో రోజుకు 10 మిలియన్ బీపీడీ క్రూడ్ ఉత్పత్తి చేసింది. వచ్చే నెల నుంచి తొమ్మిది మిలియన్ల బీపీడీకి తగ్గించాలని సౌదీనిర్ణయం తీసుకున్నది. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా క్రూడాయిల్ ఉత్పత్తిలో కోత విధించడం ఇదే అత్యధికం.
సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ఒపెక్ తోపాటు ఒపెక్ + కూటమిలో భాగస్వామిగా ఉన్న రష్యా సైతం వచ్చే ఏడాది నుంచి ముడి చమురు సరఫరాకు పరిమితి విధించాలని నిర్ణయం తీసుకోవడం దీనికి కారణం. క్రూడాయిల్ ధరల పతనానికి కళ్లెం వేయడానికే ఒపెక్ + దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ అవసరాల్లో 40 శాతం ఒపెక్ + కూటమి తీరుస్తున్నది. మొత్తం ప్రతి రోజూ 3.66 మిలియన్ బీపీడీల క్రూడ్ ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ + కూటమి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఇది గ్లోబల్ డిమాండ్లో 3.6 శాతంగా ఉండటం గమనార్హం.