Petrol Rates | రిటైల్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 లాభం గడిస్తున్నాయి కేంద్ర చమురు సంస్థలు. పాత నష్టాల పేరిట తగ్గిన ధరకు అనుగుణంగా లీటర్ పెట్రోల్ ధర తగ్గించలేదు. లీటర్ డీజిల్పై రూ.6.50 నష్టానికి విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్).. గత 15 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు సవరించలేదు.
2022 ఏప్రిల్ తర్వాత అధిక ధరలు ఉన్నప్పుడు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునే పేరిట ధర తగ్గినా సవరించకుండా వదిలేశాయి కేంద్ర చమురు సంస్థలు. గత జూన్లో బ్యారెల్ ముడి చమురు ధర 102.97 డాలర్ల నుంచి 116.01 డాలర్లకు పెరిగింది. ఈ నెలలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 78.09 డాలర్లకు పడిపోయినా రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులేదు.
`జూన్ 24తో ముగిసిన వారంతో లీటర్ పెట్రోల్పై రూ.17.4, లీటర్ డీజిల్పై రూ.27.7 మేర కేంద్ర చమురు సంస్థలు నష్టపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో లీటర్ పెట్రోల్పై రూ.10 లాభం. ఇదే త్రైమాసికంలో లీటర్ డీజిల్ నష్టం రూ.6.50కి పరిమితమైంది` అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదించింది. 2022 ఏప్రిల్ ఆరో తేదీ నుంచి రిటైల్ మార్కెట్లో కేంద్ర ముడి చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు. అదే నెలలో బ్యారెల్ ముడి చమురు ధర 102.97 డాలర్లు కాగా, గత జూన్లో 116.01 డాలర్లకు పెరిగి, ఈ నెలలో 78.09 డాలర్లకు పడిపోయింది.
గతంలో దశల వారీగా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తూ వచ్చాయి కేంద్ర చమురు సంస్థలు. ధర పెరిగితే తదనుగుణంగా సవరించిన చమురు సంస్థలు.. భారీగా ధర తగ్గినప్పుడు ఒకట్రెండు సార్లు మినహా తగ్గించిన దాఖలాల్లేవు. కానీ 15 నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలతో చమురు సంస్థలు నష్టాల్లో చిక్కుకున్నాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య మూడు చమురు సంస్థలు రూ.21,201.18 కోట్ల మేరకు నష్టపోయాయి. ఈ కాలంలో ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కింద చమురు సంస్థలకు కేంద్రం రూ.22 వేల కోట్ల సబ్సిడీ బిల్లు ఇప్పటికీ చెల్లించనే లేదు.
2021 నవంబర్ నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కరోనా వేళ ముడి చమురు ధర తగ్గినా.. కేంద్రం రెండు దఫాలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీని 2021లో తగ్గించింది. దేశవ్యాప్తంగా 90 శాతం చమురు సరఫరాపై నియంత్రణ గల మూడు చమురు సంస్థలు 2021 నవంబర్ ప్రారంభంలో రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణ నిలిపేశాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పెరిగిన క్రూడాయిల్ ధరకు అనుగుణంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై మార్చి మధ్య వరకు రూ.10 పెంచేశాయి. గతేడాది మార్చిలో పెట్రోల్పై రూ.13, డీజిల్పై రూ.16 ఎక్సైజ్ డ్యూటీ మరో దఫా తగ్గించింది. 2022 ఏప్రిల్ ఆరో తేదీన ధరల పెంపును స్తంభింప చేశాయి చమురు సంస్థలు. నాటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు సవరించకుండా సుదీర్ఘ కాలం స్తంభింప జేయడం గత రెండు దశాబ్దాల్లోనే రికార్డు.