న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,977.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,443.72 కోట్లతో పోలిస్తే 15 శాతం అధికమని పేర్కొంది. కంపెనీ ఆదాయం రూ.30,390.60 కోట్ల నుంచి రూ.43,560.72 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు రూ.38,399.33 కోట్లకు పెరగడంతో లాభాల్లో ఆశించిన స్థాయిలో వృద్ధిని కనబర్చలేకపోయామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గత త్రైమాసికంలో సంస్థ 86.66 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇది 71.74 బిలియన్ యూనిట్లు ఉన్నాయి.