వరుసగా రెండోవారం సైతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరిన తర్వాత అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. చివరకు 63 పాయింట్ల లాభంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు సెలవు అయినందున నాలుగు రోజుల ట్రేడింగ్కే ఈ వారం పరిమితం కానుంది. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో నిఫ్టీ పరిమితశ్రేణిలో ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ట్రేడింగ్ శ్రేణి విస్త్రతం కావచ్చని మరికొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
నిరోధ శ్రేణి 19,850-19,900
నిఫ్టీకి 19,850-19,900 శ్రేణి మల్టీపుల్ రెసిస్టెన్స్లు ఉన్నాయని, ఈ స్థాయిని బలంగా దాటితే 20,000-20,100 వరకూ పెరిగే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది అంచనా వేశారు. వీక్లీ చార్టుల్లో 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 19,580 స్థాయి మద్దతుగా నిలుస్తుందన్నారు. 19,500-19,900 ట్రేడింగ్ రేంజ్లో నిఫ్టీ కదలవచ్చని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. 19,850-19,700 పాయింట్ల మధ్య నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని, 19,850 స్థాయిని బలంగా బ్రేక్చేస్తే ర్యాలీ వచ్చే అవకాశాలుంటాయని ఇన్వెస్ట్4ఎడ్యు అనలిస్ట్ ఆదిత్య అగర్వాలా అంచనా వేశారు.