స్టాక్ సూచీలు గతవారం తొలిరోజున పెద్ద ర్యాలీ జరిపిన అనంతరం వారంలో మిగిలిన నాలుగు ట్రేడింగ్ రోజుల్లో స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 17,490 పాయింట్ల గరిష్ఠస్థాయివరకూ పెరిగిన నిఫ్టీ వారం మొత్తంమీద 240 పాయింట్లు లాభపడి 17,398 పాయింట్ల వద్ద ముగిసింది. రిజర్వ్బ్యాంక్ సైతం అమెరికా ఫెడ్ బాటలోనే ఎక్కువ మోతాదులోనే రెపో రేటు పెంచింది. అమెరికాలో పటిష్టమైన జాబ్స్ డాటా వెలువడటంతో సెప్టెంబర్ సమీక్షలో కూడా ఫెడ్ మరో 75 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. దీంతో కొద్దివారాలుగా ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ర్యాలీకి తాత్కాలికంగా బ్రేక్పడవచ్చని సాంకేతికాలు సూచిస్తున్నాయని టెక్నికల్ అనలిస్ట్లు సూచిస్తున్నారు.
17,500 స్థాయి కీలకం
కొద్ది రోజులుగా పటిష్ఠంగా పెరిగిన నేపథ్యంలో నిఫ్టీ వీక్లీ చార్టుల్లో ప్రస్తుతం ఓవర్బాట్ పరిస్థితి కన్పిస్తున్నదని, సూచీ మూమెంటం కోల్పోతున్నదని చార్ట్వ్యూఇండియా అనలిస్ట్ మజర్ మహ్మద్ తెలిపారు. ఈ వారం 17,350 స్థాయిని కోల్పోతే 17,160 పాయింట్ల వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు. 17,500 పాయింట్ల సమీపంలో కీలక అవరోధం ఉన్నదని, ఈ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి ర్యాలీ సాధ్యపడి 17,800 పాయింట్లను అందుకోవచ్చన్నారు. ఏప్రిల్-జూన్ మధ్యలో జరిగిన క్షీణతకు 78.6 రిట్రేస్మెంట్ ర్యాలీ జరిగిన అనంతరం అప్సైడ్ మూమెంటం మందగించిందని, ఈ రిట్రేస్మెంట్ స్థాయి 17,500 సమీపంలో ఉందని బీఎన్పీ పారిబా టెక్నికల్ అనలిస్ట్ గౌరవ్ రత్నపార్కి చెప్పారు. ఈ కారణంగా నిఫ్టీ 17,000-17,500 మధ్య కన్సాలిడేట్ కావచ్చని, వచ్చే కొద్ది రోజుల్లో 17,000 స్థాయిని పరీక్షించవచ్చని అంచనా వేశారు.