GST on Income Tax | గతంలో కాదేది కవితకనర్హం అనేవారు.. ఇప్పుడు కాదేదీ పన్నుకనర్హం.. ప్రతిదానిపైనా జీఎస్టీ వడ్డింపు శరణ్యం అనుకోవాలేమో.. ఇప్పటి వరకు వివిధ రకాల వస్తువుల కొనుగోళ్లు, సర్వీసుల వినియోగంపైన జీఎస్టీ వడ్డించారు. ఇక నుంచి ఆహార పదార్థాలు మొదలు రైల్వే టికెట్ల క్యాన్సిలేషన్కూ వడ్డిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవలే ప్రకటించింది. తాజాగా ప్రతియేటా వేతన జీవులు సమర్పించే ఐటీ రిటర్న్స్ సందర్భంగా పన్ను చెల్లింపులపైనా జీఎస్టీతోపాటు కన్వీనెన్స్ చార్జీలు కూడా వడ్డించబోతున్నట్లు ప్రకటించింది. కొన్ని రకాల పేమెంట్స్ పద్ధతులతో ఐటీ చెల్లిస్తే.. కన్వీనెన్స్ చార్జీలు, జీఎస్టీ కలగలిపి పే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని రకాల పేమెంట్స్ మోడ్పై రూ.30 వేల ఆదాయం పన్ను చెల్లింపునకు రూ.300 చార్జీ వడ్డిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పాలసీ అమల్లోకి రానున్నది.
ఈ-ఫైలింగ్ ఇన్కం టాక్స్ వెబ్సైట్పైన `పేమెంట్ గేట్వే`ను ఉపయోగించి ఇన్కం టాక్స్ చెల్లిస్తే కన్వియనెన్స్ చార్జీలు, జీఎస్టీ అమలవుతాయి. నెట్ బ్యాంకింగ్ మోడ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులు రూ.12, ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు రూ.9, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ రూ.7 చొప్పున, ఫెడరల్ బ్యాంక్తోపాటు ఇతర బ్యాంకుల ఖాతాదారులు రూ.5 కన్వియెన్స్ చార్జీ పే చేయాలి. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ వడ్డించారు.
క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తే 0.85 శాతం కన్వియెన్స్ చార్జీ ప్లస్ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేల ఇన్కం టాక్స్ చెల్లించారనుకోండి. కన్వియెన్స్ చార్జీగా (0.85 శాతం) రూ.255, కన్వియెన్స్ ఫీజుకు జీఎస్టీ రూ.45.9 పే చేయాలి. ఇలా కన్వియెన్స్ చార్జీ ప్లస్ జీఎస్టీ కలిపి రూ.300.9 అంటే దాదాపు రూ.301 అదనంగా చెల్లించాలన్నమాట. రూ.30 వేలతోపాటు రూ.301 కలిపి రూ.30,301 చెల్లిస్తే ఐటీ పేమెంట్ పూర్తవుతుంది. క్రెడిట్కార్డుతో చెల్లించిన ఇన్కం టాక్స్ను బట్టి చార్జీలు పెరుగుతాయి.