Tesla | భారత్లో కార్ల పరిశ్రమ స్థాపించడానికి టెస్లా సంస్థకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రత్యేక విధి విధానాలేమీ రూపొందించలేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) కింద ఆటో అండ్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) కోసం టెస్లా సంస్థ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏసీసీ బ్యాటరీ స్టోరేజీ కోసం ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమలకు రూ.18,100-రూ.26,058 కోట్లతో కేంద్రం ప్రత్యేకంగా పీఎల్ఐ పథకం రూపొందించిందన్నారు.
కంపెనీలన్నింటికీ కేంద్రం విధానాలు ఒకే విధంగా ఉంటాయి. టెస్లాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదని ఆ అధికారి తేల్చి చెప్పారు. అయితే, టెస్లాకు అతిపెద్ద బ్యాటరీ సప్లయర్గా పానసోనిక్ ప్రతినిధులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడంతోపాటు బ్యాటరీలు తయారు చేస్తున్నామని చెప్పారన్నారు. పీఎల్ఐ కింద ఏసీసీ బ్యాటరీల కోసం అప్లయ్ చేసుకోవాలని పానసోనిక్ ప్రతినిధులకు సూచించామని చెప్పారు.
ఇటీవల భారత్లో పర్యటనకు వచ్చిన టెస్లా ప్రతినిధులు.. వివిధ కేంద్ర ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశమయ్యారు. అమెరికాలో ఇటీవల ప్రధాని మోదీ పర్యటించినప్పుడు ఆయనతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సమావేశయమ్యారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఎలన్ మస్క్ మాట్లాడుతూ వచ్చే ఏడాది భారత్ కు వస్తానని, సాధ్యమైనంత త్వరగా దేశంలో టెస్లా కంపెనీ స్థాపిస్తామన్నారు.