అహ్మదాబాద్ : ఇంధన కొరత వెంటాడుతుండటంతో పెట్రోల్ పంపుల్లో నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న క్రమంలో ఇంధన కొరత కొనసాగుతూనే ఉంది. అహ్మదాబాద్లో గురువారం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) పెట్రోల్ పంపుల్లో గురువారం నో పెట్రోల్ బోర్డులు కనిపించడంతో వాహనదారుల్లో గుబులు మొదలైంది. నగరంలోని పలు పెట్రోల్ పంపుల్లో గురువారం వరుసగా నాలుగో రోజూ ఇంధన కొరత కొనసాగింది.
పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటాయి. గత రెండు, మూడు రోజులుగా సాధారణ ఇంధన సరఫరాల్లో కేవలం 50 శాతమే తమకు అందుతున్నాయని హెచ్పీసీఎల్ పంపు డీలర్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా చమురు కంపెనీల నుంచి రిటైలర్లకు ఇంధన సరఫరా తగ్గుముఖం పట్టడం ఇంధన కొరతకు దారితీసిందని గుజరాత్ పెట్రోలియం డీలర్ల సంఘాల సమాఖ్య పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన కొరత తలెత్తిందని హెచ్పీసీఎల్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఇంధన ధరలు ఎగబాకడం, పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులతో గత కొద్దిరోజులుగా పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఇక ఇంధన కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు భరోసా ఇస్తోంది.