Nirav Modi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి చెందిన రూ.924 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ముంబై పీఎంఎల్ఏ ప్రత్యేక (హవాలా నగదు లావాదేవీల నిరోధక చట్టం – PMLA) కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువ గల 39 ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. అదే టైంలో నీరవ్ మోదీకి, ఆయనకు చెందిన తొమ్మిది ఆస్తులను మార్టగేజ్ చేసేందుకు అనుమతించింది. ఈ ఆస్తుల విలువ రూ. 424 కోట్లు ఉంటుంది. ఈ ఆస్తులను జప్తు చేయాలని బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది.
ఈ ఆస్తుల్లో న్యూయార్క్ సెంట్రల్ పార్క్, బ్యాంక్ అకౌంట్లు, విలువైన ఆభరణాలు, గడియారాలు ఉన్నాయి. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం-2018 కింద నీరవ్ మోదీని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.
తనను భారతీయ పోలీసులకు అప్పగిస్తే, తాను బతకనని నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నారు. ఒకవేళ భారత్కు అప్పగిస్తే తనను చంపేస్తారని, లేదా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని సైక్రియాట్రిస్ట్కు చెప్పారు. జైలులో మరణించడానికే సిద్ధ పడ్డానని అన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో నీరవ్ మోదీ ఆయన మేనమామ మెహుల్ చౌక్సీ కలిసి రూ.14,500 కోట్ల నిధుల మోసానికి పాల్పడ్డారు. భారత్కు నీరవ్ మోదీని అప్పగించాలని గత ఫిబ్రవరిలో వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పు చెప్పింది. వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా లండన్ హైకోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ భారత్ను తీసుకొస్తే ముంబైలోని ఆర్టూర్ రోడ్డులో గల జైలులోని 12వ బ్యారక్లో పెట్టేందుకు ఏర్పాట్లు జరిగాయి.