ముంబై, ఫిబ్రవరి 22: తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో భారీగా లాభపడ్డాయి. దేశ ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాలు పెట్టుబడిదారుల్లో జోష్ పెంచింది. కనిష్ఠ స్థాయి నుంచి 1,200 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ లాభాల్లోకి వచ్చింది. ఐటీ, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగ షేర్లకు పెట్టుబడిదారుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ 535.15 పాయింట్లు అందుకొని 73,158.24 వద్ద ముగిశాయి. 72,677 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 73,256 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. మరో సూచీ నిఫ్టీ ఆల్టైం హైకీ చేరుకున్నది. ఇంట్రాడేలో 22,252 పాయింట్లను తాకిన నిఫ్టీ చివర్లో 162.40 పాయింట్లు అందుకొని 22,217.45 వద్ద ముగిసింది. ఇది కూడా సూచీలకు రికార్డు స్థాయి ముగింపు. ఈ నెల 20న సూచీ 22,196 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం కనిష్ఠ స్థాయికి పడిపోయిన సూచీలు చివర్లో భారీగా కోలుకున్నాయని, యూరోజోన్ దేశాల పీఎంఐ డాటా ఆశాజనకంగా ఉండటం, అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థల షేర్లు భారీగా లాభపడటం సూచీలు కోలుకోవడానికి ప్రధాన కారణమని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.