అటు అమెరికా ఫెడ్, ఇటు భారత్ రిజర్వ్బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచడంతో పాటు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నట్టు సంకేతాలు వెలువరించడంతో స్టాక్ మార్కెట్ ముగిసిన వారంలో భారీ పతనాన్ని చవిచూసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తం మీద 4.04 శాతం కోల్పోయి 16,411 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చే కొద్దిరోజుల్లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని, స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు లోనవుతాయని విశ్లేషకులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న క్రూడ్ ధర, ద్రవ్యోల్బణంతో మార్కెట్లు సమీప భవిష్యత్తులో ప్రతీ పెరుగుదలలోనూ నిరోధాల్ని ఎదుర్కొని, తగ్గుముఖం పడతాయని అంటున్నారు. అయితే త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఎంపికచేసిన షేర్లు ర్యాలీ జరిపే అవకాశాలుంటాయని చెపుతున్నారు.
మద్దతు 16,300 పాయింట్లు
గత కొద్ది నెలల్లో నిఫ్టీ 15,671 పాయింట్ల నుంచి 18,115 పాయింట్ల వరకూ జరిపిన ర్యాలీలో 61.80 శాతం రిట్రేస్మెంట్ స్థాయి దిగువకు నష్టపోయినందున, రానున్న ట్రేడింగ్ సెషన్లలో మరింత అమ్మకాలు ఒత్తిడి ఏర్పడవచ్చని చాయస్ బ్రోకింగ్ రీసెర్చ్ అసోసియేట్ పాలక్ కొఠారి అంచనా వేశారు. ముఖ్యంగా నిఫ్టీ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాట్రన్ నెక్లైన్ దిగువన ట్రేడ్కావడం బేరిష్ట్రెండ్కు సూచన. డెయిలీ చార్టుల్లో మూమెంటం ఇండికేటర్లు నెగటివ్ క్రాసోవర్తో ట్రేడ్కావడం మూమెంటం దిగువముఖంగానే ఉన్నట్టు కన్పిస్తున్నది. నిఫ్టీ తక్షణం 16,300 సమీపంలో మద్దతు, 16,600 సమీపంలో అవరోధాన్ని చవిచూడవచ్చని కొఠారి వివరించారు. 16,300 మద్దతుస్థాయి కీలకమైనదని, దీనిని సోమవారం నిలబెట్టుకోగలిగితే త్వరితంగా ఇంట్రాడే పుల్బ్యాక్ ర్యాలీ మొదలుకావొచ్చని కొటక్ సెక్యూరిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలే అంచనా వేశారు.
ఈ ర్యాలీ 16,500-16,700 శ్రేణి వరకూ కొనసాగొచ్చు. 16,300 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే మాత్రం నిఫ్టీ 16,150-16,000 శ్రేణి వరకూ పడిపోవొచ్చని చెప్పారు. అయితే ఈ వారం మార్కెట్ బలహీనపడుతున్నా, షార్ట్స్ వద్దని సాంకేతిక విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే భారీగా షార్ట్ పొజిషన్లు ఉన్నట్టు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నదని, వచ్చే కొద్ది ట్రేడింగ్ సెషన్లలో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరుగుతుందని, దీంతో స్వల్పకాలిక ర్యాలీ రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అది పరిమితంగా ఉంటుందని అంటున్నారు.