ముంబై, ఫిబ్రవరి 8: స్టాక్ మార్కెట్లకు రిజర్వు బ్యాంక్ నిర్ణయం రుచించలేదు. ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేకపోవడంతో బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకు తోడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికు తమ మొదటి ప్రాధాన్యత అని ప్రకటించడం మదుపరులపై బాంబుపడినట్టు అయింది. దీంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేకపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో ఈ నష్టాలను తగ్గించుకోగలిగింది. మార్కెట్ ముగిసే సమయానికి 723.57 పాయింట్లు లేదా ఒక్క శాతం నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 71,428.43 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కూడా 212.55 పాయింట్లు కోల్పోయి 21,717.95 వద్ద స్థిరపడింది.
వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలోనే ఉంటాయన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, వాహన, రియల్టీ, కమోడిటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. వరుసగా ఆరోసారి సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లను అమ్మకాలవైపు నడిపించాయి. అత్యధికంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3.74 శాతం తగ్గగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ 3.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.34 శాతం, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్లు దిగువకు పడిపోయాయి. బీఎస్ఈ బ్యాంకింగ్ సూచీ 1.80 శాతం తగ్గింది. వీటితోపాటు వాహన రంగ షేర్లు మూడు శాతం వరకు కోల్పోగా..రియల్టీ రంగ సూచీలు నాలుగు శాతం వరకు నష్టపోయాయి.