Toll Payments-NHAI | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ నిషేధం నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 247 టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపులకు తొమ్మిది బ్యాంకులను నామినేట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపులకు పేటీఎం ‘ఫాస్టాగ్’ ఖాతాల స్థానే ఈ బ్యాంకులను నోడల్ బ్యాంకులుగా ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది.
ఇంతకుముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తమ రిజిస్టర్ బ్యాంకుగా తొలగిస్తూ ‘ఎన్హెచ్ఏఐ’ అనుబంధ సంస్థ ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) నిర్ణయం తీసుకుంది. దీంతో పేటీఎం కొత్తగా ఫాస్టాగ్ స్టిక్కర్లను జారీ చేయలేదు. టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజుల వసూళ్లలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాటా 14 శాతం వాటా. ప్రతి రోజూ 247 టోల్ ప్లాజాల వద్ద సగటున పేటీఎం రూ.190 కోట్ల టోల్ ఫీజు వసూలు చేస్తుంది.
సుదీర్ఘకాలంగా కేవైసీ నిబంధనలు, ఇతర బ్యాంకింగ్ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందున పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ నిషేధం విధించింది. ఈ నెల 29 తర్వాత పీపీబీఎల్ ఖాతాదారుల నుంచి డిపాజిట్ సేకరించొద్దని ఆదేశించింది. పేటీఎం వాలెట్లు, ప్రీ పెయిడ్ సర్వీసులు, ఫాస్టాగ్, ఇతర సర్వీసుల కోసం మనీ డిపాజిట్ చేయొద్దని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కానీ, శనివారం ఈ గడువును మార్చి 15కు పొడిగించింది.