న్యూఢిల్లీ, మే 28: ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) విధానాల కింద మొత్తం 1,692.5 కిలోమీటర్ల పొడవునున్న 17 జాతీయ రహదారుల ఆస్తులను నగదీకరించేందుకు గుర్తించినట్టు గురువారం ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సంస్థ తెలిపింది. ఇవన్నీ కూడా తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, హర్యానా రాష్ర్టాల్లో ఉన్నట్టు ఓ ప్రకటనలో ఎన్హెచ్ఏఐ పేర్కొన్నది.
అలాగే ఈ రహదారుల ఆస్తులన్నీ ఎకనామిక్, లాజిస్టిక్ కారిడార్లతో అనుసంధానమై ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీ, కీలక ప్రాంతాలతో కలిసి ఉన్నాయని గుర్తుచేసింది. ఇక పారదర్శక, నిర్మాణాత్మక వ్యవస్థల ద్వారానే నగదీకరణ ప్రక్రియ ఉంటుందని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. టీవోటీ, ఇన్విట్లు విజయవంతమైన విధానాలని, దీర్ఘకాలంలో సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించి, జాతీయ రహదారులు మరింత విస్తరించేందుకు దోహదం చేయగలవని కూడా చెప్పింది.