న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆసియా, యూరప్ మార్కెట్లలో రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేయనున్నట్టు యమహా మోటార్స్ వెల్లడించింది. ఈ01, ఈ02 పేరిట రెండు ఈ-స్కూటర్లను కంపెనీ త్వరలో కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఈ01 మ్యాక్సీ స్కూటర్ 125సీసీ పెట్రోల్ స్కూటర్ తరహాలో పెర్ఫామెన్స్ ఇవ్వనుండగా, బ్రైడ్స్టోన్ స్లైక్ టైర్స్, డిస్క్ బ్రేకులు, ఏబీఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇక యమహా ఈ02 50సీసీ పెట్రోల్ స్కూటర్ పెర్ఫామెన్స్ను ఇస్తూ లైట్వెయిట్ బాడీ, స్వాపబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక గ్రీనర్ టూవీలర్ల ఆవిష్కరణ ప్రణాళికలో భాగంగా న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేస్తున్నట్టు యమహా మోటార్ కంపెనీ సీఈఓ, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ యషిహిరో హిదక పేర్కొన్నారు. యూరప్లో ఈ-స్కూటర్లను ఆవిష్కరించిన అనంతరం ఆసియా మార్కెట్లలోనూ వీటిని ప్రవేశపెడతామని చెప్పారు.
పలు మార్కెట్లలో మధ్యశ్రేణి మోటార్ సైకిళ్లను ఆఫర్ చేసేందుకూ యమహా ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. 2022 మార్చి నుంచి ఈ బైక్లను వరుసగా లాంఛ్ చేస్తామని చెప్పారు. 2050 నాటికి 90 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు తమ లైనప్లో ఉండేలా చర్యలు చేపడుతున్నామని యమహా స్పష్టం చేసింది.