Toll Charges | సార్వత్రిక ఎన్నికల వేళ వాహనాల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ చార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలని జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహనదారుల వద్ద పాత టోల్ చార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐ సూచించింది.
ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. టోల్ గేట్ల వద్ద టోల్ చార్జీలు పెంచుతుంది. సరాసరి ఐదు శాతం టోల్ చార్జీలు పెరుగుతాయి. ఆదివారం రాత్రి నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వచ్చినా.. ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తం టోల్ చార్జీలను సదరు వాహనదారులకు వెనక్కు చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి.ఈ నెల 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. అయితే, ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో టోల్ చార్జీల పెంపు అమల్లోకి వస్తుందా? లేదా? అన్నది స్పష్టత లేదు.