iPhone Exports | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గత నెలలో భారత్ నుంచి తన ఐ-ఫోన్ల (iPhone) ఎగుమతిలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇండస్ట్రీ బాడీ.. ఇండియా సెల్యూలార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వెల్లడించిన గణాంకాల ప్రకారం గత నెలలో విదేశాలకు రూ.12 వేల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేస్తే, అందులో 80 శాతం వాటా ఐ-ఫోన్లదే.
గత నెలలో రూ.10 వేల కోట్ల విలువైన ఐ-ఫోన్లు ఎగుమతి అయ్యాయని ఐసీఈఏ చెబుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మొత్తం ఐ-ఫోన్ల ఎగుమతుల విలువ 500 కోట్ల డాలర్లు.. అంటే రూ.40,951 కోట్లు. భారత్ నుంచి ఎగుమతుల్లో ఈ మైలు రాయి దాటిన తొలి బ్రాండ్గా ఐ-ఫోన్ నిలిచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి రెండు నెలల్లోనూ 240 కోట్ల డాలర్ల విలువ (రూ.20 వేల కోట్ల పై చిలుకు) గల ఐ-ఫోన్లు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి అయిన ఆపిల్ ఐ-ఫోన్ల విలువ కేవలం రూ.9,066 కోట్లు మాత్రమే.ఐ-ఫోన్ల తర్వాత శాంసంగ్, ఇతర బ్రాండ్ల ఫోన్లు ఎగుమతి అయ్యాయి. తాజాగా ఎయిర్ పాడ్స్ కూడా భారత్లోనే తయారు చేయాలని ఆపిల్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఐ-ఫోన్ల ఉత్పత్తిలో బారత్లోనే 18 శాతం ఉత్పత్తి అవుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది.