గాంధారి జూలై 5: తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో నెంబర్వన్ స్థానంలో నిలిపారని, ఆయన పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి మండల కేంద్రంలో సోమవారం రూ.9.20 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గాంధారి మండల ప్రజల చిరకాలవాంఛ అయిన డబుల్ రోడ్డుతోపాటు సెంట్రల్ లైటింగ్ కల త్వరలో సాకారంకానున్నదన్నారు. రోడ్డు పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆర్ఆండ్బీ అధికారులను ఆదేశించారు. పల్లెప్రగతితో గ్రామాలకు కొత్తకళ వచ్చిందన్నారు. గతంలో జీపీలకు రూ. 20 లక్షలు వచ్చేవని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఏడాదికి కోటి రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ నిధులతో పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పనులు బీజేపీ నాయకుల కండ్లకు కనబడుతలేదా అని ప్రశ్నించారు. త్వరలో 22వ ప్యాకేజీ ద్వారా కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే సురేందర్తో కలిసి కృషి చేస్తానన్నారు. అంతకు మందు ఆయన మండల కేంద్రంలో మొక్కను నాటారు.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలకు కొత్తకళ వచ్చిందని అన్నారు. ఎక్కడైనా పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని, అలాంటిది రాష్ట్రంలోని పల్లెలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. గాంధారిలో రోడ్డు పనులను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. దీంతో మండల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుందని అన్నారు. కలెక్టర్ శరత్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధాబలరాం, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, సర్పంచ్ మమ్మాయి సంజీవ్, ఏఎంసీ చైర్మన్ పెద్దబూరి సత్యం, విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, బాలరాజు, ఉప సర్పంచ్ కొమ్ముల రమేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.