CII on Oil Taxation | నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్లపై పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకార ధోరణితో వ్యవహరిస్తూ పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం.. తగ్గినప్పుడు తదనుగుణంగా ధర తగ్గించాలని హితవు చెప్పారు. ద్రవ్యోల్బణంపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఉందని పేర్కొన్నారు. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్ను చాలా ఎక్కువ. ఇది మనకు తెలుసు. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరగడం చూశాం. ఇప్పుడు చమురు ధరలు పెరిగిపోయాయి. దీనిపై పరస్పర సహకార ధోరణితో చర్చించాల్సి ఉంది. ఒక దేశం కోసం చివరికి మనం ఈ పని చేయాలి. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకున్నది. సరైన సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి అని సంజీవ్ బజాజ్ సూచించారు.
గతంలో కూడా భూ సేకరణ చట్టం, వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని గుర్తించి వాటిని వెనక్కు తీసుకున్నామని సంజీవ్ బజాజ్ గుర్తు చేశారు. ధరల స్థిరీకరణపైనే విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు.