ముంబై, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత నెలలో రెండు గంటల కంటే అధికంగా విమానాలు ఆలస్యంగా నడవడంతో 4.82 లక్షల మంది ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపిందని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ వెల్లడించింది. విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో విమానసంస్థలకు రూ.3.69 కోట్ల మేర నష్టం వచ్చిందని తెలిపింది. అయినప్పటికీ ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరిగారు. జనవరి నెలలో దేశీయంగా 4.69 శాతం పెరిగి 1.31 కోట్ల మంది ప్రయాణించారని డీజీసీఏ వెల్లడించింది.
జనవరి 2023లో దేశీయంగా 1.25 కోట్ల మంది ప్రయాణించారు. విమానాల ఆలస్యంతో 1,374 మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తిరస్కరించడంతో విమానయాన సంస్థలకు ఖర్చులు తడిసిమోపెడు అయ్యాయి. ప్రత్యామ్నాయ విమాన సర్వీసులు సమకూర్చడంతోపాటు వసతి, రిఫ్రెష్మెంట్, ఆహారం కోసం రూ.1.28 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గత నెలలో ఇండిగో 79.09 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చగా..ఎయిర్ ఇండియా విమానాల్లో 15.97 లక్షల మంది ప్రయాణించారు. మరోవైపు, గత నెలలో 732 ప్రయాణికులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో విమానానికి సంబంధించిన ఫిర్యాదులు సగం ఉండగా, 17 శాతం రిఫండ్కు సంబంధించనవని పేర్కొంది. అలాగే 10 శాతం బ్యాగేజీకి సంబంధించినవి కాగా, మరో 5 శాతం సిబ్బంది ప్రవర్తనకు సంబంధించినవి.