బెంగళూర్ : భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్ధాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి స్పష్టం చేశారు. చైనా వంటి ప్రపంచ ఆర్ధిక శక్తులతో పోటీ పడాలంటే మన యువత వారానికి 70 గంటలు కష్టించి పనిచేయాలని గతంలో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంత సుదీర్ఘ గంటలు పనిచేస్తే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు పని-జీవితం మధ్య సమతూకం దెబ్బతింటుందనే విమర్శలు వెల్లువెత్తాయి.
తన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం నేపధ్యంలో ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు, చదువుకున్న యువత మధ్య పోలిక తీసుకువచ్చారు. సబ్సిడీ విద్య ద్వారా ప్రయోజనం పొందిన వారు తక్కువ అదృష్టవంతులైన వారి స్వదేశీయులకు రుణపడి ఉంటారని సూచించారు. ప్రపంచ ఆర్ధిక శక్తులతో పోటీ పడేందుకు మన యువతకు అంతటి అంకితభావం అవసరమని స్పష్టం చేశారు.
తాను పనిచేస్తున్న రంగంలో తన కంటే మెరుగ్గా పనిచేసే వారిని, ఇతర రంగాల్లో వారినైనా తాను గౌరవిస్తానని, వారిని పిలిచి మాట్లాడుతానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. 1981లో తాను సహ వ్యవస్ధాపకుడిగా ఇన్ఫోసిస్ను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో తాను వారానికి 85-90 గంటలు పనిచేశానని,1994 వరకూ వారానికి ఆరు రోజుల పనిఉండేదని మూర్తి గుర్తుచేశారు. ఇంతటి కఠినమైన షెడ్యూల్లో పనిచేయడమే తన విజయానికి, ఇన్ఫోసిస్ గ్లోబల్ ఐటీ లీడర్గా ఎదిగేందుకు కారణమని ఆయన వివరించారు.
Read More :