Sudha Murthy | భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ (70 hour work week) ఇన్ఫోసిస్ (infosys) నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు ఇది ముమ్మాటికీ శ్రమశక్తిని దోచుకోవడమేనన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నారాయణమూర్తి భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి (Sudha Murthy) స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె భర్తకు అండగా నిలిచారు. నారాయణమూర్తి వారానికి 80 నుంచి 90 గంటలు కష్టపడి పనిచేసే వారని తెలిపారు.
‘జీవితంలో కష్టించి పనిచేస్తేనే విజయం సాధ్యమని మూర్తి బలంగా నమ్ముతారు. ఆయన స్వయంగా వారానికి దాదాపు 80 నుంచి 90 గంటలు పనిచేసేవారు. అంతకంటే తక్కువ పనిచేయడం అంటే ఏంటో ఆయనకు తెలీదు. తన జీవితమంతా ఇలాగే గడిపారు. ఇప్పుడు కూడా తన మనసుకు అనిపించిందే చెప్పారు’ అని సుధామూర్తి స్పష్టం చేశారు.
దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ పడాలంటే యువకులు ఎక్కువగా కష్టపడక తప్పదని పేర్కొన్నారు. ‘3వన్4 పాడ్కాస్ట్’ వారి తొలి ఎపిసోడ్ ‘ది రికార్డ్’లో నారాయణమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాల వీడియోను గురువారం యూట్యూబ్లో విడుదల చేశారు. జాతి నిర్మాణం, సాంకేతికత, తమ ఇన్ఫోసిస్ కంపెనీతోపాటు అనేక విషయాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్లో పని ఉత్పాదకత ప్రపంచంలోనే అతి తక్కువ అని చెప్పారు. చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే దేశ యువత తమ పని గంటలను పెంచాలని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీలు అలాగే చేశాయని తెలిపారు. భారత్లో పని ఉత్పాదకత తగ్గడానికి ప్రభుత్వంలో అవినీతి, అధికారుల అలసత్వం కూడా కారణమని అభిప్రాయపడ్డారు. ఇది పోనంతవరకు అగ్రరాజ్యాలతో పోటీపడలేమని స్పష్టం చేశారు.
Also Read..
Mukesh Ambani | అంబానీకి 4 రోజుల్లో మూడో బెదిరింపు మెయిల్.. ఈసారి 400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
Jyothi Yerraji | గోవాలో నేషనల్ గేమ్స్.. 100 మీటర్ల హర్దిల్స్లో రికార్డు బ్రేక్ చేసిన జ్యోతి
Dubbak | కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం.. నేడు దుబ్బాక బంద్