హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగ ముఖ చిత్రాన్ని మార్చేసిన మై హోమ్ గ్రూపు మరో చరిత్రను సృష్టించింది. గృహ, వాణిజ్య రియల్ ఎస్టేట్ విభాగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న మై హోమ్ గ్రూపు.. తాజాగా 35 సంవత్సరాల వేడుకలను ఘణంగా నిర్వహించింది. ఈ వేడుకకు ప్రతీకగా ఈ ఏడాది చివరినాటికి నిర్మాణాల్లో 35 మిలియన్ చదరపు అడుగుల మార్కును చేరుకోవాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నది. ఇప్పటికే 27 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నిర్మాణాలు చేపట్టి డెలివరీ చేసిన సంస్థ.. మరో 8 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను కొనసాగిస్తున్నది.
ఈ ఏడాది చివరినాటికి ఈ నిర్మాణాలను పూర్తిచేసి కొనుగోలుదారులకు అందచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి ఏ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. మరో రూ.30 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోకాపేట్, తెల్లాపూర్ వద్ద రాబోతున్న ఈ ప్రాజెక్టులు వచ్చే ఐదేండ్లలో పూర్తికావచ్చని చెప్పారు. కోకాపేట్లో 27 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన కమర్షియల్ ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య ప్రాజెక్టు అన్నారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.6 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత సంస్థ ఆదాయం రూ.40 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. దీంతో వచ్చే ఐదు నుంచి ఎనిమిదేండ్ల కాలంలో మరో 40 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టినట్లు అవుతున్నదన్నారు.
కరోనాతో మారిన అభిరుచులు
కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలపాటు రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత ఏర్పడినప్పటికీ తిరిగి కోలుకున్నదని ఆయన తెలిపారు. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యంత వేగవంతంగా కోలుకున్నదన్న ఆయన మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. అయితే మళ్లీ వైరస్ విజృంభిస్తుండటంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ డిజిటల్ సొల్యుషన్స్ ద్వారా 3డీలో గృహాన్ని వీక్షించవచ్చును.
ఐపీవోకి వచ్చే అవకాశాల్లేవు
స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు లేవని కంపెనీ డైరెక్టర్ రాము రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ, సిమెంట్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, కొత్తగా విద్యా, సినిమా ఇతర రంగాల్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. అలాగే దేశీయంగా సిమెంట్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10 మిలియన్ టన్నుల సిమెంట్ను ఏటా ఉత్పత్తి చేస్తున్నది సంస్థ.
‘గత మూడు దశాబ్దాలకుపైగా వినియోగదారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసి వారి నమ్మకాన్ని ఇలాగే కొనసాగిస్తామన్న విశ్వాసం ఉన్నది’
– శ్యామ్ రావు, మై హోం ఎండీ
‘నాణ్యమైన జీవన విధానాన్ని అందరికి అందించాలనే లక్ష్యంతో ప్రయాణాన్ని ఆరంభించాను. కష్టపడే తత్వం, అంకిత భావంతో పనిచేయడం వల్లనే గత 35 ఏండ్లుగా నిర్మాణ రంగంలో నిలదొక్కుకోగలిగాం. 10 వేల కుటుంబాలకు నాణ్యమైన గృహాలను నిర్మించి ఇవ్వడంతోపాటు 50 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించాం’