Mutual Funds | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసిపోతున్నది. నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొదలు కానున్నది. కొత్త ఆర్థిక సంవత్సరానికి వెళ్లే లోపు ప్రతి ఒక్కరూ.. ప్రత్యేకించి వేతన జీవులు, ఇన్వెస్టర్లు తప్పనిసరిగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఒకటి. ప్రతి ఒక్కరూ.. ప్రత్యేకించి మిలినియల్స్ తమ భవిష్యత్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు.
ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే వారు ఈ నెలాఖరులోపు తమ పెట్టుబడులకు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. అలా చేయలేని పక్షంలో నామినీ అవసరం లేదంటూ డిక్లరేషన్ అయినా సమర్పించాలి. అలా చేయని వారి మ్యూచువల్ ఫండ్ ఖాతాలు స్తంభించి పోతాయి. తత్ఫలితంగా అప్పటిదాక చేసిన ఇన్వెస్ట్మెంట్లు, దానిపై ఆదాయం తిరిగి పొందడం సాధ్యం కాదు.
అంతే కాదు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పాన్ కార్డు సమర్పించని వారు కూడా ఉంటారు. అలా పాన్ కార్డు లేకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన వారు ఈ నెలాఖరులోగా సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లి వారి ఫండ్ఖాతాతో పాన్ కార్డు అనుసంధానించుకోవాలి. అలా పాన్ కార్డు, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలకు అనుగుణంగా పత్రాలు సమర్పించాలి. లేని పక్షంలో సదరు మ్యూచువల్ ఫండ్స ఖాతాలను ఫ్రీజ్ చేస్తారని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది.
ఇక మ్యూచువల ఫండ్స్లో నామినీ తప్పనిసరిగా ఎంపిక చేయాలని గత ఏడాది జూన 15వ తేదీనే సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. నామినీ ఎంపిక లేదా నామినీ అవవసరం లేదంటూ డిక్లరేషన అయినా సబ్మిట్ చేయాలని సూచించింది. తొలుత గతేడాది ఆగస్టు ఒకటో తేదీ, తర్వాత 2023 మార్చి 31 వరకు గడువు పొడిగించింది.
గతంలో మ్యూచువల్ ఫండ్ ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు చాలామంది తమ నామినీలను ఎంచుకోలేదని మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెబుతున్నాయి. అనూహ్యంగా వారికేమైనా అయితే, క్లయిమ్ చేసుకోవడానికి వారి చట్టబద్ధ వారసులకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొందరు మదుపర్లు తమ ఇండ్లలో మ్యూచువల్ ఫండ్ ఖాతాలు ఓపెన్ చేసిన సంగతి కూడా చెప్పట్లేదని చెప్పారు. దీనివల్ల భారీగా నిధులు పేరుకుపోతున్నాయని, తత్ఫలితంగానే నామినీ పేరు తప్పనిసరి చేస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతున్నారు మ్యూచువల్ ఫండ్ నిపుణులు.
నామినీలను ఎంపిక చేసుకుంటారా.. నామినీ అవసరం లేదని డిక్లరేషన్ సమర్పిస్తారా.. అనే విషయమై ఖాతాదారులకు సంబంధిత మ్యూచువల్ ఫండ్ సంస్థలు అన్ని రకాల వసతులు కల్పించాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్లో గానీ, ఆఫ్ లైన్లో గానీ సంబంధిత పత్రాలు సమర్పించేందుకు వీలు కల్పించాలని సూచించింది. ఆన్లైన్లో వివరాలు వెల్లడించే వారి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత కూడా సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీలదేనని తేల్చి చెప్పింది.