ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదు. ఈ విషయాన్ని తన తాజా వార్షిక నివేదికలో ఆ సంస్థ వెల్లడించింది. గతేడాది కరోనా కారణంగా దేశ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలుసు కదా. ఇలాంటి సమయంలో తాను జీతం తీసుకోవడం సరికాదని భావించిన ముకేశ్.. దానిని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
నిజానికి గత 12 ఏళ్లుగా ముకేశ్ అంబానీ జీతంలో ఎలాంటి పెరుగుదల లేదు. 2008-09 నుంచి ఆయన వార్షిక జీతం రూ.15 కోట్లుగానే ఉంది. అటు ఆయన బంధువులు నిఖిల్, హితల్ మేస్వానీ వార్షిక జీతాలు కూడా చాలా కాలంగా రూ.24 కోట్లుగానే ఉన్నట్లు రిలయన్స్ వార్షిక నివేదిక చెప్పింది. కంపెనీ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు అయిన నీతా అంబానీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.8 లక్షల సిట్టింగ్ ఫీజు, రూ.1.65 కోట్ల కమీషన్ అందుకున్నారు. మరోవైపు కొవిడ్ కారణంగా తమ ఉద్యోగులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. వారి నామినీకి ఐదేళ్ల పాటు జీతం ఇవ్వనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.