Mukesh Ambani | ఆసియా కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. సంస్థ యాజమాన్య బాధ్యతలను తన వారసులకు అప్పగించనున్నారు. ముకేశ్ అంబానీకి కూతురు ఈషాతోపాటు కొడుకులు ఆకాశ్, అనంత్ ఉన్నారు. మంగళవారం రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ జయంతి.. రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముకేశ్ అంబానీ ఈ అంశం బయట పెట్టారు. ఇప్పటి వరకు తన వారసులకు.. యువతరానికి సంస్థ యాజమాన్య బాధ్యతలను అప్పగించే విషయమై ముకేశ్ అంబానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
తనతో సహా సంస్థ సీనియర్లంతా యువతరానికి బాధ్యతలు అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నట్లు రిలయన్స్ ఆధీనంలోని ఆంగ్ల దిన పత్రిక న్యూస్ 18లో వార్త ప్రచురితమైంది. పెట్రోలియం రంగం మొదలు రిటైల్.. టెలికం.. డిజిటల్.. ఈ-కామర్స్ తదితర రంగాల్లో పేరొందిన భారత అంతర్జాతీయ కంపెనీల్లో రిలయన్స్ ఒకటి. భవిష్యత్లో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాలతోపాటు రిటైల్, టెలికం రంగాల్లో బిజినెస్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నారు.
భారీ స్నప్నాల సాకారంతోపాటు అసాధ్యం కానీ లక్ష్యాల దిశగా సంస్థను సరైన వ్యక్తులు.. సరైన నాయకత్వానికి అప్పగించాల్సి ఉంది. నా తరానికి చెందిన సీనియర్ల నుంచి భవిష్యత్ తరానికి ప్రతినిధులైన యువ నాయకత్వానికి రిలయన్స్ నాయకత్వ పరివర్తన ప్రక్రియ ప్రారంభమైంది అని ముకేశ్ అంబానీ చెప్పారు. ఈ ప్రక్రియ వేగవంతం కావాలని అని ఆయన అన్నారు. అయితే, ముకేశ్ అంబానీ వ్యాఖ్యలపై స్పందించడానికి రిలయన్స్ అందుబాటులోకిరాలేదు.