Mukesh Ambani on BSNL | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను బలోపేతం చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఇండియా మొబైల్ కాంగ్రెస్లో దేశవ్యాప్తంగా 5జీ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ శక్తిమంతమైన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ చాలా వ్యూహాత్మక రంగమైన టెలికం సెక్టార్లో సమతుల్యత తీసుకొస్తుందని అన్నారు.
`బీఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ప్రభుత్వాలను అభినందిస్తున్నా. చాలా వ్యూహాత్మక రంగం టెలికంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బలోపేతం కావడంతో సమతుల్యత సాధించొచ్చు` అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
డిజిటలైజేషన్ వేగవంతం ద్వారా పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు 5జీ వారధిగా నిలుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకగా భారత్లో అత్యుత్తమ నాణ్యతతో కూడిన 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.
2023 డిసెంబర్ నాటికి ప్రతి పట్టణం, ప్రతి తాలుకా, ప్రతి తహసీల్కు 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని ముకేశ్ అంబానీ తెలిపారు. దీపావళి నాటికి ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా నాలుగు నగరాల్లో.. కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.