Interest Rates | గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత్వం ఏర్పడుతుందని ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’ పేర్కొంది. బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లకు చేరుకుంటే.. ధరలు పెరిగిపోవడంతోపాటు డాలర్ పై రూపాయి విలువ పతనం అవుతుంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అదే జరిగితే మళ్లీ ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచే చాన్స్ ఉందని వ్యాఖ్యానించింది.
దేశీయ ఇంధన అవసరాల కోసం భారత్ అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. ఈ నేపథ్యంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర మరో 10 డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం 50బీపీఎస్ పెరుగొచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా నివేదిక పెరిగింది. విదేశీ వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు 30 బేసిక్ పాయింట్లు పెరుగుతుందని తెలిపింది. ఇప్పటికైతే జీడీపీలో కరంట్ ఖాతా లోటు (క్యాడ్) 2.5 శాతం వద్దే కొనసాగుతున్నది.
గత కొన్ని నెలలుగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తున్నది. ద్రవ్యోల్బణం నాలుగు శాతం కంటే దిగువకు దిగి వచ్చే వరకూ ఆర్బీఐ ఇదే వైఖరి అవలంభించనున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లు దాటితే మాత్రం.. ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే మళ్లీ వడ్డీరేట్ల పెంపు అనివార్యమని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది. ఒకవేళ 95 డాలర్ల వద్దే క్రూడాయిల్ ధరలు కొనసాగితే మాత్రం వడ్డీరేట్లలో కోత మరింత ఆలస్యం అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ నెల రెండో తేదీన క్రూడాయిల్ బ్యారెల్ 87.09 డాలర్లు, గత నెల పొడవునా బ్యారెల్ క్రూడాయిల్ 90.08 డాలర్లు కొనసాగింది. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 85 డాలర్లు పలికింది.