ముంబై, ఫిబ్రవరి 11: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఎస్బీఐక్యాప్ ట్రస్టీ కంపెనీ తెలిపింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీలు తనఖా పెట్టినట్టు ఎస్బీఐక్యాప్ ట్రస్టీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ తనఖా వివరాల్ని రాయిటర్స్ వార్తా సంస్థకు ఎస్బీఐ ప్రతినిధి వెల్లడిస్తూ అదానీ ఎంటర్ప్రైజెస్కు ఆస్ట్రేలియాలోని కార్మిచెల్ కోల్ ప్రాజెక్టు కోసం ఎస్బీఐ కల్పించిన 300 మిలియన్ డాలర్ల స్టాండ్బై లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) ఫెసిలిటీలో భాగంగా అదనపు కొలాటరల్గా మూడు గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా పెట్టినట్టు తెలిపారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎస్బీఐ నుంచి పొందిన ఎల్సీ విలువకు 140 శాతం కొలాటరల్ కవరేజ్ ఉండేలా చూస్తారు. అంటే చెల్లించాల్సిన రుణానికి 140 శాతం విలువైన సెక్యూరిటీలను తనఖా చేయాలి. షేరు ధరలు పతనమైతే రుణంలో కొంత చెల్లింపు చేయమని, లేదా అదనపు షేర్లను తనఖా ఉంచమని బ్యాంక్లు రుణగ్రస్తుల్ని డిమాండ్ చేస్తాయి. తనఖా విలువలపై ప్రతీ నెలా బ్యాంకర్లు సమీక్షిస్తారు. దీని ప్రకారం ఎంటీఎం (మార్క్ టు మార్కెట్, సెక్యూరిటీల ప్రస్తుత మార్కెట్ విలువ) ఖాతాలో ఏ మాత్రం తగ్గుదల ఏర్పడినా రుణగ్రస్త సంస్థ టాప్ అప్ (అదనపు తనఖా) చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ ప్రతినిధి తెలిపారు.