Moodys on India GDP | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత్ వృద్ధిరేటుపై ప్రముఖ రేటింగ్ సంస్థ ‘మూడీస్ (Moody’s)’ మరోమారు కోత విధించింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి తోడు దేశీయంగా వడ్డీరేట్లు భారీగా పెరిగిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బ తింటాయని భావిస్తున్నట్లు పేర్కొంది. భారత్ వృద్ధిరేటును సవరించడం గత సెప్టెంబర్ తర్వాత తొలిసారి. ఇక వచ్చే ఏడాది (2023) లో జీడీపీ వృద్ధిరేటు 4.8 శాతానికి కుదించుకుపోతుందని, తిరిగి 2024కల్లా 6.8 శాతానికి పుంజుకుంటుందని వివరించింది.
ఇంతకుముందు 8.8 శాతంగా ఉంటుందని గత మే నెలలో మూడీస్ అంచనా వేసింది. తిరిగి సెప్టెంబర్లో 7.7 శాతానికే పరిమితం అవుతుందని పేర్కొన్న మూడీస్.. తాజాగా అది కేవలం ఏడు శాతంతోనే సరిపెట్టుకుంటుందని తెలిపింది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచడంతోపాటు గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా వృద్ధిరేటు తగ్గిపోయిందని అంచనా వేసినట్లు మూడీస్ గ్లోబల్ మాక్రో ఔట్లుక్ 2023-24 నివేదికలో వెల్లడించింది.
భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో 8.5 శాతం పెరిగింది. మూడీస్ అధికారిక జీడీపీ అంచనాల ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ వృద్ధిరేటు 13.5 శాతం నమోదవుతుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కంటే 4.10శాతం ఎక్కువ. సెప్టెంబర్ త్రైమాసికం అంచనాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ మరింత బలహీన పడటంతోపాటు అధిక ముడి చమురు ధరలు.. దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీస్తాయని మూడీస్ హెచ్చరించింది. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఈ ఏడాది వరకు ఆర్బీఐ నియంత్రిత స్థాయి ఆరు శాతానికంటే ఎక్కువగానే ద్రవ్యోల్బణం నమోదు కావచ్చునని వివరించింది. సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతానికి పెరిగితే, హోల్సేల్ ద్రవ్యోల్బణం వరుసగా 18వ నెలలోనూ డబుల్ డిజిట్స్ నమోదుతో 10.7 శాతం వద్ద రికార్డయింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ గత మే నెల నుంచి 190 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసింది. తాజాగా మరో 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ ఆర్బీఐ పెంచుతుందని మూడీస్ అంచనా వేస్తున్నది.
భారత్ వృద్ధిరేటు 6.5 శాతమేనని ఇంతకుముందు ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం 7.4 నుంచి 6.8 శాతానికి కుదించి వేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా భారత్ జీడీపీ 7.5 నుంచి 7 శాతానికి కోత విధించింది. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్.. 8.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సైతం ఈ ఏడాది జీడీపీ 7శాతం మాత్రమేనని అంచనా వేసిన సంగతి తెలిసిందే.