LIC | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): 67 ఏండ్ల చరిత్ర, 1.2 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా రూ. 46 లక్షల కోట్ల ఆస్తులు, కోట్లాదిమంది పాలసీదారులు.. ప్రపంచ బీమా దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికార్డులు ఇవి. అయితే బీజేపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఎల్ఐసీ క్రమంగా నిర్వీర్యమయ్యే దుస్థితి దాపురించింది. అయితే, ఈ విషయాలన్నీ మరుగునపెట్టి ఎల్ఐసీ మరింత శక్తిమంతంగా మారుతున్నదని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో మాట్లాడుతూ ఈమేరకు ప్రధాని అబద్ధాలు వల్లెవేశారు.
విలువను తక్కువ చేస్తూ..
ఎంతో పరపతి కలిగి లాభాల బాటలో ఉన్న ఎల్ఐసీని కేంద్రం బలిపెట్టింది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని పూడ్చుకొనేందుకు హడావుడిగా ఎల్ఐసీ ఐపీవో ప్రవేశపెట్టడం, ఎల్ఐసీ విలువను తక్కువ చేస్తూనే.. భారీ ధరకు షేరును కోట్ చేయడంతో బీమా దిగ్గజానికి కష్టాలు మొదలయ్యాయి. ఇక, దేశంలో ఏ పెద్ద మ్యూచువల్ ఫండ్ చేయనంతగా భారీగా ఎల్ఐసీ.. అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టడం, హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్నకు నష్టం వాటిల్లడం వెరసి ఆ ప్రభావం ఎల్ఐసీపై పడింది. అందుకే కిందటేడాది రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో లిస్టయిన ఎల్ఐసీ.. ప్రస్తుతం రూ. 4.07 లక్షల కోట్లకు పడిపోయిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక, ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గత ఏడాది మార్చిలో రూ. 42,319 కోట్లు కాగా, ఈ ఏడాది మార్చికి 32 శాతం క్షీణతతో రూ. 28,716 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయాన్ని మాత్రమే అర్జించింది. ఇదంతా జరిగినా.. ఎల్ఐసీ శక్తిమంతంగానే ఉన్నదంటూ ప్రధాని చెప్పుకురావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.