న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: త్వరలో మెగా ఐపీవోకు రానున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎంబడెడ్ విలువను 66.6 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 5 లక్షల కోట్లు) ప్రభుత్వం ఖరారు చేసింది. సంస్థ ఎంబడెడ్ విలువ ఎంతమేరకు ప్రభుత్వం నిర్ధారిస్తుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. బీమా కంపెనీల ఆర్థిక స్థితిగతుల్ని ఈ విలువ ప్రతిబింబిస్తుంది. బీమా కంపెనీలకు స్టాటస్టికల్, ఇతర సర్వీసులు అందించే మిల్లిమాన్ అడ్వయిజర్స్ ఎల్ఎల్పీ…సంస్థ విలువను లెక్కించిందని డిజిన్వెస్ట్మెంట్ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. కంపెనీ ఎంబడెడ్ విలువను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించడం ఇదే ప్రథమం. ఈ విలువ 53 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్లవరకూ ఉండవచ్చన్న కథనాలు ఇప్పటివరకూ మీడియాలో వెలువడ్డాయి. ఎల్ఐసీ మార్కెట్ విలువకు ఈ ఎంబడెడ్ విలువే ప్రాతిపదిక అవుతుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా ప్రభుత్వం ఎంతమేర నిధులు సమీకరించగలదన్న అంశాన్ని నిర్ధారిస్తుంది. ‘ఎల్ఐసీ ఎంబడెడ్ విలువ రూ. 5 లక్షల కోట్లను మించుతుంది. దీనికి మార్కెట్ విలువ మరిన్ని రెట్లు ఉంటుంది’ అని పాండే వివరించారు.
ఆర్ఐఎల్, టీసీఎస్ల చెంతకు..
ఎంబడెడ్ విలువపై మిల్లిమాన్ అడ్వయిజర్స్ తుది నివేదిక కోసం..ఈ ఐపీవో పనిలో నిమగ్నమైన మార్చెంట్ బ్యాంకింగ్ సంస్థలు, ఇష్యూ అరేంజర్లు వేచిచూస్తున్నారు. ఎంబడెడ్ విలువను నిర్ధారించిన అంశాల్ని నివేదికలో పరిశీలించిన తర్వాత ఏ ధరకు ఇష్యూ జారీచేయాలో నిర్ణయిస్తారు. బీమా కంపెనీల మార్కెట్ విలువ.. ఎంబడెడ్ విలువకు మూడు-నాలుగు రెట్లు ఉండవచ్చన్న అంచనాల్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విలువ ప్రకారం ఎల్ఐసీ ఐపీవోలో 5 శాతం వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 75,000 కోట్లు సమీకరించే అవకాశం వుంది. రూ.15-20 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆధారంగా ఇష్యూ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తే… ఆ ధరపై ఐపీవో విజయవంతమైతే, ఎల్ఐసీ భారత్లోని కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), టీసీఎస్ల సరసన చేరుతుంది. ఆర్ఐఎల్, టీసీఎస్ల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.15-17 లక్షల కోట్ల మధ్య ఉంది. అయితే ఐపీవో ధరకు ఎంబడెడ్ విలువ ఒక్కటే ఆధారం కాదని, ఇష్యూ జారీ అయ్యే సమయంలో మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల నుంచి వ్యక్తమయ్యే ఆసక్తి, బీమా పరిశ్రమలో ట్రెండ్స్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎంబడెడ్ విలువ అంటే..
సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీల విలువను ఎంబడెడ్ వాల్యూ మెథడ్ ప్రకారం లెక్కిస్తారు. ఈ పద్దతిలో..కంపెనీ భవిష్యత్లో ఆర్జించే లాభాల ఆధారంగా ప్రస్తుత విలువ ఎంత ఉంటుందో లెక్కిస్తారు. దానిలో సంస్థ ప్రస్తుత నికర ఆస్తుల విలువ (ఎన్ఏవీ)ని కూడా కలిపి మొత్తం ఎంబడెడ్ విలువను గణిస్తారు.
ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? కేంద్ర మంత్రిని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతున్నదో చెప్పాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ను ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘కేసీఆర్ గారి ప్రశ్నకు సుత్తిలేకుండా సూటిగా సమాధానం చెప్పండి గౌరవ నిర్మలా సీతారామన్ గారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీని అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటి? అని ఎమ్మెల్సీ కవిత గురువారం ట్వీట్ చేశారు.