ఖజానాకు ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్లు
విండ్ఫాల్ ట్యాక్స్పై బ్రోకరేజ్ల అంచనాలు
న్యూఢిల్లీ, జూలై 5: దేశీయంగా ఉత్పత్తయ్యే చమురు, పెట్రో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లతో ఖజానాకు రూ.1.30 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని వివిధ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. అలాగే ఈ పన్నులతో ఓఎన్జీసీ లాభాలు తీవ్రంగా తగ్గుతాయని, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనింగ్ మార్జిన్ బ్యారల్కు 12 డాలర్ల వరకూ క్షీణిస్తుందని బ్రోకరేజ్లు పేర్కొన్నాయి. జూలై 1న హఠాత్తుగా పెట్రోల్/ఏటీఎఫ్లు (లీటర్కు రూ.6/బ్యారల్కు 12 డాలర్లు), డీజిల్ (లీటర్కు రూ.13/బ్యారల్కు 26 డాలర్లు)పై ఎగుమతి సుంకాల్ని పెంచిన సంగతి తెలిసిందే. దేశీ క్రూడ్ ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250/ బ్యారల్కు 40 డాలర్లు) విండ్ఫాల్ ట్యాక్స్ను విధించగా, బంగారంపై దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచారు.
ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్పై ఎక్సయిజ్ సుంకాల తగ్గింపుతో కేంద్రం ఆదాయంలో రూ.1 లక్ష కోట్లు గండి పడుతుందని, దానిని పూడ్చే లక్ష్యంతోనే విండ్ఫాల్ ట్యాక్స్ విధింపు జరిగినట్టు భావిస్తున్నామని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ విడుదల చేసిన నోట్లో పేర్కొంది. ఈ కొత్త పన్నులతో రూ.1.20 లక్షల కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ పన్నులు పూర్తి ఏడాది కొనసాగితే క్రూడ్ ఉత్పత్తిపై ద్వారా రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై ద్వారా రూ.52,700 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. తాజా పన్నులతో ప్రభుత్వానికి పూర్తి ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని, ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన తొమ్మిది నెలలో రూ. 1 లక్ష కోట్ల ఆదనపు ఆదాయం వస్తుందని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. మరో బ్రోకరేజ్ సంస్థ యబీఎస్ తన అంచనాల్లో ఈ ఆదాయం రూ.1.38 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొంది. మూడు రవాణా ఇంధనాల ద్వారా రూ.68,000 కోట్లు, క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్తో రూ.70,000 కోట్లు సమకూరవచ్చని అంచనా వేసింది.
తొమ్మిది నెలల్లో రూ.95 వేల కోట్లు: మూడీస్
చమురు కంపెనీలపై విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లపై కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన తొమ్మిది నెలల్లో (2022 జూలై-2023 మార్చి) 12 బిలియన్ డాలర్ల (రూ.94,800 కోట్లు) ఆదాయం లభిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ తెలిపింది. ఈ పన్నుల భారంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర పెట్రో ఎగుమతి కంపెనీలు, ఓఎన్జీసీ తదితర చమురు ఉత్పత్తి సంస్థల లాభాలు గణనీయంగా తగ్గుతాయన్నది. ఇటీవల పెట్రోల్, డీజిల్పై ఎక్సయిజు సుంకాల తగ్గింపుతో కోల్పోయిన ఆదాయం తాజా పన్నుల విధింపుతో ప్రభుత్వం పూడుతుందని, దీంతో ప్రభుత్వంపై ద్రవ్య ఒత్తిడి తగ్గుతుందని మూడీస్ వివరించింది.
ఆర్ఐఎల్కు రూ.47 వేల కోట్ల దెబ్బ
పెట్రో ఎగుమతి పన్నులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 12 డాలర్ల మేర (వార్షికంగా రూ.47,000 కోట్లు) దెబ్బతింటాయని నోమురా తెలిపింది. ఆర్ఐఎల్ షేరుకు లాభం రూ.36 మేర తగ్గుతుందని, ఒఎన్జీసీ లాభం షేరుకు రూ.30 చొప్పున తగ్గుతుందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. అయితే దేశీ విక్రయాల ద్వారా ఆర్ఐఎల్కు మార్కెటింగ్ మార్జిన్లలో వస్తున్న నష్టం..ఎగుమతి పన్నుకంటే ఎక్కువగా ఉన్నందున, ఆ సంస్థ గణనీయంగానే ఎగుమతులు జరుపుతుందని బ్రోకరేజ్ సంస్థ భావిస్తున్నది. క్రూడాయిల్పై సుంకాలతో ప్రభుత్వానికి 3-4 బిలియన్ డాలర్ల ఆదాయం నికరంగా (రాయల్టీలు, ఆదాయపు పన్ను, డివిడెండ్ల తగ్గుదల పోను) ప్రభుత్వానికి సమకూరుతుందని జేఎం మోర్గాన్ తెలిపింది. బంగారంపై వేసిన అదనపు సుంకాలతో ఏడాదికి 1.5-2 బిలియన్ డాలర్ల ఆదాయం రావొచ్చని, పెట్రో ఉత్పత్తుల ఎగుమతులపై విధించిన పన్నులతో 9 బిలియన్ డాలర్ల స్థూల ఆదాయం లభించవచ్చని అంచనా వేసింది. బ్యారల్పై 40 డాలర్ల విండ్ఫాల్ ట్యాక్స్తో ఓఎన్జీసీ లాభాలు తీవ్రంగా దెబ్బతింటాయని, కొత్త పన్నుతో పాటు 20 శాతం ఆయిల్ సెస్ను, 10-20 శాతం రాయల్టీని సంస్థ చెల్లిస్తుందని, దీంతో ఆయిల్ ధరలో నికరంగా ఓఎన్జీసీకి 40 శాతమే వస్తుందని సిటి గ్రూప్ వివరించింది. ఎగుమతి చేసే పెట్రో ఉత్పత్తులపై ఆర్ఐఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్ బ్యారల్కు 9-10 డాలర్ల మేర తగ్గవచ్చని సిటి అంచనా వేసింది. ప్రస్తుతం రిలయన్స్ బ్యారల్కు 25 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్ ఆర్జిస్తున్నదని తెలిపింది.