న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఆన్లైన్ క్రీడల వేదిక మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సుమారు 350 మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. దేశంలో కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో ఇది దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఎంపీఎల్ వ్యయ నియంత్రణ చర్యల్లోకి దిగింది. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు కంపెనీ అంతర్గత ఈ-మెయిల్ సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. ప్రారంభ స్థాయి వద్ద పందేల ముఖ విలువ ఆధారంగా ఇటీవలి జీఎస్టీ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై పన్నును గరిష్ఠ స్థాయి 28 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ‘కొత్త నిబంధనలు మాపై పన్ను భారాన్ని ఏకంగా 350-400 శాతం వరకు పెంచాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పట్లేదు. ఈ క్రమంలోనే సుమారు 350 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాం. ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన సహచరులు, స్నేహితుల్లో కొందరికి ఇది బాధాకరం’ అని ఎంపీఎల్ సహవ్యవస్థాపకుడు సాయి శ్రీనివాస్ అన్నారు.