హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : విప్లవాత్మకమైన ప్రభుత్వ, పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిదేండ్లలోనే 47 బిలియన్ డాలర్ల(రూ.4 లక్షల కోట్లకు పైగా)విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 35% కేవలం తెలంగాణ నుంచే తయారవుతున్నాయని, 200కు పైగా ఎఫ్డీఏ అనుమతులున్న తయారీ యూనిట్లు కలిగిన రాష్ట్రం తెలంగాణేనని ఆయన అన్నారు. దావోస్లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత హెల్త్కేర్ కంపెనీల అధిపతులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్గా తెలంగాణ అవతరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఐపాస్ పారిశ్రామిక విధానం గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం యొక ప్రత్యేకతను, ప్రాధాన్యతను గుర్తించిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం తన నాలుగోవ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నదని, ఈ కేంద్రం ముఖ్యంగా హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగం యొక పురోగతి కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యికిపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయని, ఇందులో నోవార్టిస్, మెడ్ట్రానిక్, బేయర్, సనోఫీ, రోషే, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి తదితర అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ఫార్మా, సైన్సెస్ల్లో పెట్టుబడులు పెట్టండి..
రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు సిద్ధంగా ఉండాలని, ఈ రెండు విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ఆయా సంస్థలకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఉన్న లైఫ్ సెన్సెస్, ఫార్మా రంగాల్లో కేవలం తయారీ యూనిట్లు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికే పలు సంస్థలు ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫార్మా లైఫ్ సైన్సెస్తో పాటు ఐటీ, ఐటి అనుబంధ రంగంలోనూ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నదని, ముఖ్యంగా అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి కంపెనీలు తమ రెండొ క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయని ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులకు కేటీఆర్ తెలిపారు. డాటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాలను లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉపయుక్తంగా మార్చుకున్నాయన్నారు. హైదరాబాద్లో ఉన్న కెమిస్ట్రీ, బయోలజీ, జెనిటిక్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో అద్భుతమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.