Hyderabad | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అనతికాలంలోనే బయో హబ్గా ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఫార్మా, కెమికల్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ లీడర్గా అవతరించిందని చెప్పారు. గురువారం హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో రూ.1,000 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూరోఫిన్స్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్ను ప్రారంభించడం హర్షణీయమని, ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీ అని తెలిపారు. యూఎస్ఎఫ్డీఏ అనుమతులు పొందిన ఫార్మా యూనిట్లు రాష్ట్రంలో 214 ఉన్నాయని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెప్పారు. తెలంగాణ దేశంతోనో.. లేకపోతే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ర్టాలతోనో పోటీ పడటం లేదని.. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగిందని చెప్పారు. వచ్చే ఫిబ్రవరిలో జీనోమ్ వ్యాలీలో బీ(బయోటెక్) హబ్ను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
బెల్జీయంకు చెందిన టెస్టింగ్ సొల్యుషన్స్ సేవల సంస్థ యూరోఫిన్స్.. ఇక్కడ 15 ఎకరాల స్థలంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కోసం ఇప్పటికే రూ.150 కోట్లను ఖర్చు చేసింది. ప్రస్తుతం సంస్థలో 100 మంది నిపుణులు పనిచేస్తున్నారు. అయితే వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ క్యాంపస్లో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే యూరోఫిన్స్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు, బయోఫార్మా విభాగం అధ్యక్షురాలైన నటాలియా షుమన్ను కలిశానని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
యూరోఫిన్స్ రీజినల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్ మాట్లాడుతూ… భారత్లో యూరోఫిన్స్, యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా ఫార్మాస్యూటికల్, అగ్రోసైన్సెస్ కంపెనీలకు ఆర్ అండ్ డీ అవసరాల కోసం సేవలను అందించనున్నదని తెలిపారు. ఈ పెట్టుబడి పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు.ఆసియాలో డ్రగ్ డిస్కవరీ, డెవలప్మెంట్ సేవలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. అంతర్జాతీయ ఫార్మా సంస్థల అడ్డగా జీనోమ్ వ్యాలీ మారిపోయింది. ఇక్కడ 200కి పైగా గ్లోబల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి.
– రాజీవ్ మాలిక్, యూరోఫిన్స్ డైరెక్టర్