హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన టెక్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీల తయారీదారులు, రీసైక్లర్లు భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. ఈ క్లస్టర్లో ప్రధానంగా ఇంజినీరింగ్, బ్యాటరీ టెస్టింగ్, తయారీ, ఆవిష్కరణలు, ప్రతిభకు సంబంధించిన జోన్లు ఉంటాయని వివరించారు.
బుధవారం రాయదుర్గంలో బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ (బీజీఎస్డబ్ల్యూ) నూతన స్మార్ట్ క్యాంపస్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నగరంలో ఫార్ములా ఇ రేసుతోపాటు ఈవీ వీక్, ఈవీ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిని ఏటా నిర్వహిస్తామన్నారు. టెక్నాలజీ కంపెనీలకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధిని పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిందని వెల్లడించారు. బీజీఎస్డబ్ల్యూ కొత్త క్యాంపస్ తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రతిభ, ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సీఎం నిబద్ధతకు నిదర్శనం..
హైదరాబాద్ నగర అభివృద్ధికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాజీపడబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు హైదరాబాద్ నగర అభివృద్ధే నిదర్శనమన్నారు. 2014తో పోల్చితే ఐటీ ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయని గుర్తుచేశారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు 2014-15లో రూ.57వేల కోట్లుగా ఉంటే.. 2021-22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు ఎగిశాయని వివరించారు. గత ఏడాది దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో మూడోవంతు హైదరాబాద్లోనే వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో నిరుడు 4.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని, ఒక్క హైదరాబాద్లోనే 1.57 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం..
సమర్థవంతమైన నాయకత్వంలో అతి తక్కువ వయసున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, అందుకే ఆటోమొబైల్సహా అనేక రంగాల్లో నగరం పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ చురుకైన, మెరుగైన విధానాలను చూసి ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా బ్యాటరీస్ మహబూబ్నగర్లో సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని గుర్తుచేశారు.
అనేక బహుళజాతి సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని చెప్పారు. 1.5 లక్షల చదరపు అడుగుల సదుపాయంతో అతిపెద్ద కంపెనీగా ఉన్న బాష్ ఆటోమోటివ్ రంగంలో మరింతగా రాణిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే 1,400 మంది ఉద్యోగుల్ని నియమించుకోగా, ఈ సంఖ్య 3వేలు దాటి పోనుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ర్టాలతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులంతా హైదరాబాద్ను తమ నివాసంగా మార్చుకున్నారని, ఒకసారి నగరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక్కడి అనుకూల వాతావరణం వల్ల నగరంతో ఎలా మమేకం అవుతారనేందుకు ఇది నిదర్శనమన్నారు.
ప్రగతిపథంలో తెలంగాణ
‘ఆటోమోటివ్ ఇంజినీరింగ్, డిజిటల్ ఎంటర్ప్రైజెస్పై బాష్ దృష్టి సారించింది. హైదరాబాద్లో డిజిటల్ వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు బలమైన గ్లోబల్ డెలివరీ నెట్వర్క్ను నిర్మించేందుకు సంస్థ కృషి చేస్తున్నది. కొత్తగా ప్రారంభించిన స్మార్ట్ క్యాంపస్ భారత్తోపాటు ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే ఉన్న కస్టమర్లు, కొత్త కస్టమర్లతో కంపెనీకి ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
-కిరణ్ సుందరరామన్, బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ సెంటర్ హెడ్