సంగారెడ్డి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీకి తెలంగాణ అడ్డాగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు అన్నారు. ప్రపంచమంతటా విద్యుత్తు ఆధారిత వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న మంత్రి.. ఈ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిసారి తెలంగాణలో ఈవీల తయారీ చట్టం తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జహీరాబాద్, దివిటిపల్లి, ఎన్కతలలో ఇన్నోవేషన్, రిసెర్చ్, ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రొడక్షన్ హబ్లను పెడుతున్నట్టు ప్రకటించారు.
సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంస్థ తయారు చేసిన ‘జోర్ గ్రాండ్’ వాహనాన్ని మంత్రి స్వయంగా నడిపించి బాగుందని కితాబిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాలుష్యం, కర్బన ఉద్గారాల కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని, ఈ సమస్యకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఒక్కటే పరిష్కార మార్గం అని పేర్కొన్నారు.
2020 సెప్టెంబర్లోనే..
ఈవీ పరిశ్రమల ఏర్పాటు, వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ 2020 సెప్టెంబర్లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఇందులోభాగంగా మహీంద్రా కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్స్-బ్యాటరీలు పెద్ద ఎత్తున తయారు కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, మహీంద్రా తయారుచేసే ఎలక్ట్రిక్ వాహనాలను మున్సిపాలిటీల కోసం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ కోసం ఈవీ బస్సులు కొనుగోలు చేస్తున్నదని వివరించారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇక జహీరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని కూడా స్పష్టం చేశారు.
మన విధానాలు.. దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాలు దేశానికి రోల్మోడల్గా ఉన్నాయని, ముఖ్యంగా టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావివ్వకుండా పారదర్శకంగా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నదని, అలా రాకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని చెప్పారు. పరిశ్రమలకు 24 గంటల కరెంటుతోపాటు మూడు షిప్టులు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వ విధానాలతో తెలంగాణలోని ఏ ఒక్క చిన్న పరిశ్రమలో కూడా తొమ్మిదేండ్లలో సమ్మెగానీ లాకౌట్గానీ జరుగలేదన్నారు. రాజకీయ స్థిరత్వం, మంచి పారిశ్రామిక పాలసీలు అమలు చేయడం వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, జిల్లా కలెక్టర్ శరత్, మహీంద్రా కంపెనీ ప్రతినిధులు రాజీవ్ గోయల్, అబంతి శంకర్ నారాయణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొంతు రామ్మోహన్, మఠం భిక్షపతి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమలు.. పెట్టుబడులు.. ఉద్యోగాలు
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలో 23 వేల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణకు రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు రావటంతోపాటు 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే మహీంద్రా ఎలక్ట్రిక్ యూనిట్లోనూ స్థానికులకు ఉద్యోగాలివ్వాలని ఆ కంపెనీ సీఈవోను కోరారు. సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంత యువకులు నైపుణ్యం పెంచుకుని పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందాలని సూచించారు.
‘జహీరాబాద్లో ఈవీల తయారీ యూనిట్కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉన్నది. త్వరలోనే ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రపంచస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో తోడ్పాటునిస్తున్నది’
-సుమన్ మిశ్రా, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సీఈవో
‘మహీంద్రాతో కలిసి ఎంతో కాలంగా పని చేస్తున్నాం. కంపెనీ కొత్త యూనిట్ను ఏర్పాటు చేస్తుండటం శుభ పరిణామం’
-వెండీ వెర్నర్, ఐఎఫ్సీ భారత ప్రతినిధి
‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో మంచి విధానాలను అమలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగా తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తున్నాయి. మరోవైపు కేంద్రం కార్మికులపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది. దేశంలోని అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేస్తున్నది’
-చుక్క రాములు, మహీంద్రా కార్మిక సంఘం అధ్యక్షుడు
‘మహీంద్రా కొత్త యూనిట్ను ఏర్పాటు చేస్తుండటం సంతోషకరం’
-మాణిక్రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే