Homes | ఒకవైపు పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపోరేట్ పెంచడంతో బ్యాంకులన్నీ తమ రుణాలు.. ప్రత్యేకించి ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెంచేశాయి. వడ్డీరేట్లు పెరగడం ఆలోచనలో పడేసినా ఇండ్ల కొనుగోలు దారులు మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ, మున్ముందు వడ్డీరేట్లు పెరిగితే మాత్రం సొంతింటి కల నిజం చేసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటామని పలువురు అభిప్రాయ పడ్డారు. ఇండ్ల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టడం బెటర్ అని మిలియనిల్స్ భావిస్తున్నారు. 61 శాతం మంది రియల్ ఎస్టేట్ రంగంలో ఇండ్ల కొనుగోళ్లకు పెట్టుబడులు పెట్టడం బెస్ట్ అని చెబుతున్నారు.
96 శాతం మంది మాత్రం ఇండ్ల రుణాలపై అధిక వడ్డీరేట్లు ఇల్లు కొనుగోలు చేయాలన్న తమ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. అయితే, వడ్డీ రేట్ల కంటే, ఇండ్ల ధరలకే తమకు ప్రాధాన్యం అని 80 శాతం మంది పేర్కొన్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ అన్రాక్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది ఇండ్ల ధరలూ వడ్డీరేట్లు పెరిగినా ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లను కొనుగోలు చేయడానికే మొగ్గుతున్నారు.
42 శాతం మంది ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్ల కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 40 శాతం మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొనుగోలుకు మొగ్గుతున్నారు. సింగిల్ బెడ్ రూం ఇండ్లతో సరి పెట్టుకుంటామని 12 శాతం మంది మాత్రమే చెబుతున్నారు. కానీ ఒక ఏడు శాతం మంది మాత్రం ఫోర్ బెడ్ రూమ్స్ ఇల్లు కొనాలని ఆశ పడుతున్నారు.
వచ్చే ఏడాదిలోపు ఇండ్లు కొనుక్కోవాలని 36 శాతం మంది తల పోస్తున్నారని సీఐఐ-అన్ రాక్ సంయుక్త సర్వేలో వెల్లడించారు. 58 శాతం మంది రూ.45 లక్షలు-రూ.1.50 కోట్ల మధ్య ధర ఉన్న ఇండ్ల కొనుగోలుకు మొగ్గుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో 45 శాతం మంది భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రిపుల్ బెడ్ రూం ఇండ్లు కొనుగోలు చేయాలని తలపోస్తున్నారు.
ఇండ్ల కొనుగోలులో వాటి రేట్లు పెంపు ఒక అంశం మాత్రమేనని అన్రాక్ చైర్మన్ అనూజ్ పూరీ చెప్పారు. ఆర్థిక మాంద్యం ముప్పు భయాల నేపథ్యంలో ఇటీవల భారీగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని, దాని ప్రతికూల ప్రభావం వచ్చే ఆరు నెలల్లో ఉంటుందని తేల్చి చెప్పారు. లే-ఆఫ్స్ వల్ల పలువురు ఎగ్జిక్యూటివ్లు, ఐటీ నిపుణులు తమ ఇండ్ల కొనుగోలు ఆలోచనను వాయిదా వేశారని అన్నారు. తిరిగి రెండేండ్లలో ఇండ్ల కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ-అన్రాక్ సంయుక్తంగా ‘ది హౌసింగ్ మార్కెట్ బూమ్’ అనే పేరుతో నిర్వహించిన సర్వేలో 5,500 మంది పాల్గొన్నారు.