Microsoft | ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో ఇప్పటికే వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపిన మైక్రోసాఫ్ట్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఫుల్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచకూడదని, బోనస్లు, స్టాక్ అవార్డులకు బడ్జెట్ తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల ఇంటర్నల్ ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం. దీనిపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి స్పందించడానికి ముందుకు రాలేదు.
‘గతేడాది మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరుకు అనుగుణంగా పరిహారం చెల్లింపునకు గణనీయంగా పెట్టుబడి పెట్టాం. మన గ్లోబల్ మెరిట్ బడ్జెట్ దాదాపు డబుల్ అయింది. ఈ ఏడాది పలు రూపాల్లో ఆర్థిక పరిస్థితులు చలా విభిన్నంగా ఉన్నాయి’ అని ఆ మెయిల్లో సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు సమాచారం.
గత జనవరిలో మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపింది. ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయటపడేందుకు టెక్నాలజీ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు కొనసాగనున్నాయి. దీర్ఘకాలిక విజయం కోసం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. టెక్నాలజీ రంగంలో పోటీ తత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.