Satya Nadella | సెర్చింజన్ ‘గూగుల్’పై, దాని విధానాలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ధ్వజమెత్తారు. గూగుల్తో ఇంటర్నెట్ రంగంలో పోటీ పడేందుకు మైక్రోసాఫ్ట్కు కూడా కష్టతరంగా మారిందన్నారు.. గూగుల్ మార్కెట్ వాటా, దాని గుత్తాధిపత్యమే దీనికి కారణం అని పేర్కొన్నారు. గూగుల్కు అమెరికా ప్రభుత్వ ‘యాంటీ ట్రస్ట్’ కేసు విచారణలో సత్య నాదెళ్ల కూడా పాల్గొన్నారు.
స్మార్ట్ ఫోన్లు, వెబ్ బ్రౌజర్లకు డీఫాల్ట్ సెర్చింజన్ అవతారం ఎత్తేందుకు ‘గూగుల్’ కోట్ల డాలర్లలో చెల్లించి ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నదని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. అందుకే గూగుల్తో మైక్రోసాఫ్ట్ పోటీ పడలేకపోతున్నదని అన్నారు.
ఈ అంశంపై వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో మూడున్నర గంటల పాటు తన వాదనలు వినిపించారు. తాజాగా టెక్నాలజీ రంగంలో కొత్తగా ఆవిర్భవిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలోనూ గుత్తాధిపత్యం సాధించేందుకు గూగుల్ ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికే ఇంటర్నెట్.. గూగుల్ వెబ్గా మారిందని, ఇకముందు తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి గూగుల్.. టూల్స్ నిర్మిస్తుందని పేర్కొన్నారు.
గూగుల్ నిబంధనలకు అనుగుణంగా పబ్లిషర్లు, అడ్వర్టైజర్లు తమ కంటెంట్ రూపొందిస్తారని సత్యనాదెళ్ల తెలిపారు. తత్ఫలితంగా తమ మైక్రోసాఫ్ట్ సెర్చింజన్ ‘బింగ్’ ఏర్పాటు చేసినా, ఇతర సంస్థలు సొంతంగా సెర్చింజన్లు తీసుకొచ్చినా.. గూగుల్తో పోటీ పడి మార్కెట్పై గణనీయ ప్రభావం చూపలేకపోతున్నాయని చెప్పారు.