Air India | టాటా సన్స్ ఆధీనంలో ఎయిర్ఇండియా సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ నియామకానికి కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో మహారాజా సీఈవో కం ఎండీగా క్యాంప్బెల్ విల్సన్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయ్యిందని కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ అంశంపై స్పందించడానికి ఎయిర్ఇండియా అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం దేశీయ విమానయాన సంస్థలో కీలక అధికారులుగా విదేశీయుల నియామకానికి కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
గత మే 12న క్యాంప్బెల్ విల్సన్ను ఎయిర్ఇండియా సీఈవో కం ఎండీగా నియమిస్తున్టన్లు టాటా సన్స్ ప్రకటించింది. నష్టాల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వంనుంచి ఈ ఏడాది జనవరి 27న టాటా సన్స్ టేకోవర్ చేసింది. మహారాజాను టేకోవర్ చేసిన రెండు వారాల్లోపే టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐకీని ఎయిర్ఇండియా సీఈవో కం ఎండీగా టాటా సన్స్ నియమించింది. గత ఏప్రిల్ ఒకటో తేదీన బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, దేశంలో కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఎయిర్ఇండియా ఎండీ కం సీఈవోగా బాధ్యతలు చేపట్టడానికి ఐకీ నిరాకరించారు.
అటుపై సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ స్కాట్ ఎయిర్ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా ఎయిర్లైన్స్లో సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ పార్టనర్గా ఉంది. క్యాంప్బెల్ విల్సన్ ఇంతకుముందు కెనడా, హాంకాంగ్, జపాన్లలో సేవలందించారు. 2011లో సింగపూర్లో స్కాట్ ఎయిర్ స్థాపించడంతోపాటు 2016 వరకు సీఈవోగా సారధ్యం వహించారు.