న్యూయార్క్ : ఫేస్బుక్ మాతృసంస్ధ మెటా ఇటీవల 11,000 మంది ఉద్యోగులను సాగనంపుతూ వారందరికీ పలు నగదు ప్రయోజనాలతో కూడిన పరిహార ప్యాకేజ్ను ప్రకటించింది. అయితే ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన పరిహారాన్ని టెక్ కంపెనీ అందించడం లేదని వెల్లడవుతోంది. కొందరు ఉద్యోగులను తొలగించిన అనంతరం వారికి ఇచ్చిన పరిహార ప్యాకేజ్ కంటే తమకు తక్కువ ప్రయోజనాలు వర్తింపచేశారని పలువురు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు.
లేఆఫ్స్ ప్రక్రియలో భాగంగా మెటా ఇటీవల వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని స్పష్టం చేసింది. 16 వారాల బేస్ సెవరెన్స్ పేమెంట్తో పాటు ప్రతి ఏడాది సర్వీస్కు రెండు వారాల అదనపు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చింది. హెల్త్ కేర్ అసిస్టెన్స్నూ ఆఫర్ చేస్తామని టెక్ దిగ్గజం పేర్కొంది. ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరు నెలల పాటు వర్తిస్తుందని వెల్లడించింది. \
అయితే కంపెనీ కేవలం 8 వారాల బేస్ పే చెల్లిస్తోందని, కోబ్రా ఇన్సూరెన్స్ను మూడు నెలలకే వర్తింపచేస్తోందని పలువురు ఉద్యోగులు తెలిపారు. తాము ఫుల్టైమ్ ఉద్యోగులమైనా తక్కువ పరిహార ప్యాకేజ్ ఎందుకు ఆఫర్ చేస్తున్నారనే దానిపై మెటా ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని కొలువు కోల్పోయిన ఉద్యోగులు వాపోతున్నారు. పరిహార ప్యాకేజ్లో లోటుపాట్లపై కొందరు బాధిత ఉద్యోగులు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు లేఖ పంపారు. తమ సమస్యను కంపెనీ ఉన్నతాధికారులు సత్వరమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.