Luxury Cars | గతంతో పోలిస్తే భారతీయులు లగ్జరీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా, ఆడి ఇండియా.. ఫెస్టివల్ సీజన్ విక్రయాల్లో రికార్డు నమోదు చేశాయి. ప్రతి ఏడాది పొడవునా మామూలుగా సాగే లగ్జరీ కార్ల విక్రయాల్లో ఈ ఏడాది మెరుగైన రికార్డు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓనం నుంచి దీపావళి వరకూ ఫెస్టివ్ సీజన్లో మెరుగ్గా కార్ల విక్రయాలు జరిపామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ చెప్పారు. ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న పలు కొత్త మోడల్ కార్లతోపాటు కస్టమర్ల సెంటిమెంట్ కూడా బలంగా ఉందన్నారు. జీఎల్సీ వంటి ఎస్యూవీ కార్ల తయారీలో సప్లయ్ చైన్ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి -సెప్టెంబర్ మధ్య లగ్జరీ కార్ల విక్రయాల్లో 88 శాతం గ్రోత్ రికార్డైందన్నారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 5,530 యూనిట్ల కార్లు విక్రయించినట్లు తెలిపారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్ బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్ బ్యాక్ వంటి మోడల్ కార్లు బెస్ట్ మోడల్ కార్లుగా నిలిచాయని చెప్పారు. గత ఏడేండ్లలో తొలిసారి ఈ ఏడాది అత్యధిక కార్లు విక్రయించామని చెప్పారు. హైదరాబాద్ మొదలు కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర నగరాల్లో తమ కార్లకు మంచి డిమాండ్ ఉందన్నారు.
లగ్జరీ కార్ల విక్రయాలు 2018 రికార్డులను అధిగమిస్తుందని బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఈ ఏడాది 46,000-47,000 యూనిట్ల కార్లు అమ్ముడవుతాయని భావిస్తున్నామని, ఈ ఏడాది హై డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రం పవాహ్ మాట్లాడుతూ పండుగల సీజన్లో శక్తిమంతమైన కార్లు, మోటారు సైకిళ్లు మార్కెట్లోకి రిలీజ్ చేశామన్నారు.
మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని సైతం ఈ ఏడాది 25 శాతానికి పైగా కార్లు నాన్ మెట్రో నగరాల్లోనే విక్రయించిందని ఆ సంస్థ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. గతేడాది 71 రోజుల పండుగల సీజన్లో మొత్తం 8.10 లక్షల కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య రిటైల్ కార్ల విక్రయాలు పది లక్షల మార్క్ను దాటేశాయి.