హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణను 2050నాటికి పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ను ఆవిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగానే 55 కిలోమీటర్ల మేర మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించినట్టు ఆయన చెప్పారు.
ప్రతిపాదిత రివర్ ఫ్రంట్లో అమ్యూజ్మెంట్ పారులు, జలపాతాలు, వాటర్ స్పోర్ట్స్, వ్యాపార కేంద్రాల వంటి వాటితోపాటు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో షాపింగ్ మాల్స్ కూడా వస్తాయన్నారు. గురువారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ఇక్కడి ఓ హోటల్లో నిర్వహించిన మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ సమ్మిట్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిద్దాలన్న లక్ష్యంతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని చేపడుతున్నామని చెప్పారు.
దీనివల్ల స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఎదిగేందుకూ అవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు వస్తాయన్నారు. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వ్యాపారావకాశాలు కూడా పెరుగుతాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. సాంస్కృతిక కార్యకలాపాలకు కూడా స్థలాలను కేటాయించడం వల్ల స్థానిక సంస్కృతికి వైభవం వస్తుందని, వీధి విక్రేతలకు స్థలాల కేటాయింపు ద్వారా వారికి జీవనోపాధి కలుగుతుందని వివరించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టువల్ల టూరిజం, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్లో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ సాయి డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.