ముంబై, మే 17:స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. గడిచిన ఆరు రోజులుగా భారీ నష్టాలతో కొనసాగిన దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్లు మంచి బూస్ట్నిచ్చాయి. మెటల్, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగ సూచీల నుంచి లభించిన మద్దతుతో మంగళవారం సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 1,500 పాయింట్ల స్థాయిలో లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,344.63 పాయింట్లు లేదా 2.54 శాతం లాభపడింది. చివరకు వారం గరిష్ఠ స్థాయి 54,318.47 వద్ద ముగిసింది. గడిచిన మూడు నెలల్లో ఒక్కరోజులో ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 417 పాయింట్లు(2.63 శాతం) అందుకొని 16,259.30 వద్ద స్థిరపడింది.
టాటా స్టీల్ 7.62 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. అంత్యంత విలువైన సంస్థయైన రిలయన్స్ షేరు 4.26 శాతం ఎగబాకింది.
వీటితోపాటు ఇన్ఫోసిస్, ఐటీసీ, లార్సన్ అండ్ టుబ్రో, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, మారుతి షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.
ఫిబ్రవరి 5 తర్వాత సూచీలు ఒక్కరోజు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి..
స్టీల్, ఎనర్జీ రంగాలకు చెందిన స్టాక్లు ఇచ్చిన దన్నుతో 50 సూచీలు భారీగా లాభపడ్డాయి.
టోకు ధరల సూచీ 15 శాతానికి చేరుకున్నప్పటికీ మదుపరులు కొనుగోళ్ళు జరిపారు.
బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 2.78 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 2.51 శాతం చొప్పున ర్యాలీ చేశాయి.
12 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్ల స్మార్ట్ ర్యాలీతో మదుపరులు సంపద అమాంతం పెరిగింది. బీఎస్ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ సూచీ 1,344 పాయింట్లు లాభపడటంతో మదుపరుల సంపద రూ.12 లక్షల కోట్లకు పైగా అధికమైంది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.12,05,523.65 కోట్లు పెరిగి 2,55,55,447.68 కోట్లకు చేరుకున్నది.