Maruti Q3 Results |దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నికర లాభం రెట్టింపైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ నికర లాభం రెట్టింపుకు పైగా పెరిగింది. 2021-22 డిసెంబర్ త్రైమాసికంలో కేవలం రూ.1,011 కోట్ల నికర లాభం గడించింది. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ నికర లాభాలు రూ.2,351 కోట్లకు దూసుకెళ్లాయి. మంగళవారం మారుతి సుజుకి గత డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.
గత నెలతో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకి 4.65 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2022లో మారుతి సుజుకి 19.40 లక్షల కార్లు, ఇతర వాహనాలను విక్రయించింది. ఇంతకుముందు కంటే అత్యధికంగా కార్ల విక్రయాలు జరిగాయి. గతేడాది 19,40,067 కార్లు విక్రయించింది. వివిధ దేశాలకు ఎగుమతులు కూడా రికార్డు స్థాయికి చేరుకుని 2,63,068 యూనిట్ల వద్ద నిలిచాయి. గతేడాది 25 మిలియన్ల యూనిట్లను మారుతి సుజుకి ఉత్పత్తి చేసింది.
మారుతి సుజుకి సేల్స్ నెట్వర్క్ 3,500 ఔట్లెట్లకు పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం మధ్యాహ్నం మారుతి సుజుకి షేర్ రెండు శాతానికి పైగా పెరిగి రూ.8595 వద్ద ట్రేడయింది. ఏడాది కాలంలో ఏడు శాతానికి పైగా లబ్ధి పొందితే, గత నెల నుంచై ఐదు శాతం పుంజుకున్నది.