Maruti @ Kamarajar Port | తమిళనాడులోని కామరాజర్ పోర్టుతో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా చేతులు కలిపింది. ప్రపంచ మార్కెట్కు తమ కార్లను ఎగుమతి చేసేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఐదేండ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఆటోమొబైల్ యూనిట్లను దిగుమతి, ఎగుమతి చేసేందుకు కామరాజర్ పోర్ట్ యాజమాన్యం కార్-కమ్-జనరల్ కార్గో బెర్త్ను అభివృద్ధి చేసింది.
మారుతీ సుజుకీ కార్లను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా, ఓషియానియా, సార్క్ దేశాలకు ఎగుమతి చేసేందుకు కామరాజర్ పోర్టు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మారుతీ కార్ల సంస్థ భావించింది. ఈ పోర్ట్ నుంచి ఏటా 20 వేల వాహనాలను ఎగుమతి చేయనున్నట్లు మారుతీ సుజుకీ సంస్థ గురువారం ప్రకటించింది. దేశంలో ఎగుమతుల కోసం కంపెనీకి ఇది నాలుగో పోర్ట్. ప్రస్తుతం మారుతీ సుజుకీ తన వాహనాలను ముంబై, ముంద్రా, పీపావావ్ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నది.
వివిధ దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలుగా తమిళనాడులోని కామరాజర్ పోర్టు సరైందని భావించి ఒప్పందం చేసుకున్నట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. ఈ పోర్టు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను చేరుకోవడం చాలా ఈజీగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎగుమతులు చేస్తున్న మూడు పోర్టులపై భారం తగ్గించేందుకే కామరాజర్ పోర్టుతో ఒప్పందం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.