Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’.. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభాల్లో 80 శాతం గ్రోత్ నమోదైంది. 2022-23 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,061 కోట్ల నికర లాభం గడిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.3,716 కోట్ల నికర లాభం పొందింది. మార్కెట్ అంచనాలను మారుతి సుజుకి బ్రేక్ చేసింది.
ఆపరేషన్ల ద్వారా మారుతి సుజుకి ఆదాయం 24 శాతం పెరిగి రూ.37,062 కోట్లకు చేరుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆల్ టైం రికార్డ్ సేల్స్ నమోదు కావడంతో నికర లాభంలోనూ రికార్డు నెలకొల్పామని మారుతి సుజుకి తెలిపింది. కార్ల ప్రేమికులంతా ఎస్యూవీ మోడల్స్పైనే మనస్సు పారేసుకోవడంతో మారుతి సుజుకి కూడా ప్రధానంగా ఎస్యూవీ కార్ల విక్రయంపైనే ఫోకస్ చేసింది. ఎస్యూవీ సెగ్మెంట్ లో మారుతి వాటా 23.3 శాతం.
కమోడిటీ ధరలు తగ్గడంతోపాటు కార్ల తయారీ ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు ఫలించడం, నికర సేల్స్ సమర్థవంతంగా ఉండటం వంటి కారణాలు మారుతి సుజుకి నికర లాభాల్లో గ్రోత్ నమోదైందని తెలిపింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మారుతి సుజుకి 5.52 లక్షల కార్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 7.7 శాతం ఎక్కువ. వాటిలో 4.82 లక్షల యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయిస్తే, 69,324 కార్లు విదేశాలకు ఎగుమతి చేసింది మారుతి సుజుకి. సెప్టెంబర్ త్రైమాసికంలో 12.9 శాతం మార్జిన్లు సాధించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో మారుతి సుజుకి లాభం రూ.6,202 కోట్లు. గతేడాది నమోదైన రూ.3,074 కోట్లతో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువ లాభం గడించింది.