Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండింతలకు పైగా నికర లాభం గడించింది. రూ.2444 కోట్ల నికర లాభం గడిస్తుందన్న మార్కెట్ వర్గాల అంచనాలను దాటుకుని రూ.2,485 కోట్ల నికర లాభం సముపార్జించింది.
గతేడాదితో పోలిస్తే సంస్థ కార్యకలాపాల నిర్వహణ ద్వారా ఆదాయం 22 శాతం పెంచుకున్నది. 2022-23లో రూ.31,778 కోట్ల ఆదాయం గడిస్తే, ఈ ఏడాది రూ.32,327 కోట్ల ఆదాయం పొందింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4,98,030 యూనిట్లు విక్రయించింది. 2022-23తో పోలిస్తే 6.4 శాతం ఎక్కువ. దేశీయ మార్కెట్లో సేల్స్ తొమ్మిది శాతం పెరిగి 4,34,812 యూనిట్లకు చేరితే, విదేశాలకు ఎగుమతులు తొమ్మిది శాతం తగ్గి 63,218 యూనిట్లకు పరిమితమైంది. ఎలక్ట్రానిక్ విడి భాగాల కొరత వల్ల 28 వేలకు పైగా కార్లు ఉత్పత్తి చేయలేకపోయినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన ఫైలింగ్ లో తెలిపింది.
జూన్ నెలాఖరు నాటికి వివిధ మోడల్ కార్లతో కలిపి సుమారు 3.55 లక్షల కార్ల డెలివరీ పెండింగ్ లో ఉంది. త్వరిగతిన ఆర్డర్ల మేరకు కార్ల డెలివరీ ప్రారంభిస్తామని వివరించింది మారుతి సుజుకి.